
గ్రేటర్ హైదరాబాద్
దీని నివారణే శాస్త్రవేత్తల ముందున్న అతిపెద్ద సవాల్: డాక్టర్ ఏకే సింగ్
రాజేంద్రనగర్, న్యూస్టుడే: ప్రపంచంలో 130 కోట్ల మంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని భారత వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఏకే సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో జరుగుతున్న 5వ అంతర్జాతీయ అగ్రానమి కాంగ్రెస్ నాలుగవ రోజు శుక్రవారం కొనసాగింది. పలు సెషన్లలో జరిగిన ఈ సదస్సులో వివిధ దేశాల నుంచి శాస్త్రవేత్తలు వర్చువల్ పద్ధతిలో, ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పౌష్టికాహార సమస్యపై డాక్టర్ ఏకే సింగ్ ప్రసంగించారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించేలా కృషిచేయడం వ్యవసాయ శాస్త్రవేత్తల ముందున్న అతిపెద్ద సవాల్ అని పేర్కొన్నారు. 2050 నాటికి పూర్తిస్థాయిలో ఆహారభద్రత సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. సదస్సులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన స్టాల్కు ఉత్తమ ప్రదర్శన అవార్డు లభించింది. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్రావు, ఐసీఏఆర్ ఏడీజీ డాక్టర్ ఎస్.భాస్కర్, డాక్టర్ వీకే సింగ్ తదితరులు పాల్గొన్నారు.