
తెలంగాణ
విశాఖ నుంచి తొలుత సింగపూర్, శ్రీలంకకు
ఈనాడు, విశాఖపట్నం: విశాఖ నుంచి విదేశాలకు విహార నౌకల సర్వీసులు ప్రారంభించే దిశగా నౌకాశ్రయం అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. విశాఖ నౌకాశ్రయంలో క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ ఏడాదిలో పూర్తి చేయాలి. ఆలోపు విశాఖ నగరానికి అంతర్జాతీయ విహార నౌకలు వచ్చేలా ఏర్పాట్లు చేయాలి. దేశంలోని ముంబయి, కొచ్చి, గోవా, మంగళూరు, చెన్నై తదితర నౌకాశ్రయాలకు అంతర్జాతీయ విహార నౌకలు వస్తుంటాయి. ఆయా సర్వీసులు నడిపే సంస్థల ప్రతినిధులతో మాట్లాడి విశాఖకు కూడా విదేశీ పర్యాటకులు వచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి వీలుగా సర్వీసులు ఉండేలా షిప్పింగ్ ఏజెంట్లు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. అంతర్జాతీయ విహార నౌకలు ఐదు నక్షత్రాల హోటళ్లలోని సౌకర్యాలను అందిస్తాయి. రెస్టారెంట్లు, ఈత కొలను, తదితరాలన్నీ అందుబాటులో ఉంటాయి.
ఇదో మైలురాయి
విశాఖ నౌకాశ్రయంలో క్రూయిజ్ టెర్మినల్ అందుబాటులోకి రానుండడం ఏపీ పర్యాటక రంగంలో మైలురాయి. నౌకాశ్రయం, కేంద్ర నౌకాయాన, పర్యాటక శాఖల భాగస్వామ్యంతో టెర్మినల్ ఏర్పడుతోంది.విశాఖకు అంతర్జాతీయంగా పేరు రావడానికి ఉపయుక్తంగా ఉంటుంది.
- కె.రామమోహనరావు, ఛైర్మన్, విశాఖ నౌకాశ్రయం
విశాఖ నుంచి క్రూయిజ్ ప్రయాణాలు
అంతర్జాతీయ విహారాలతో పాటు విశాఖ నుంచి సమీపంలోని తీర నగరాలకు క్రూయిజ్ ప్రయాణాలను నిర్వహించుకోవచ్చు. నౌక ప్రయాణమార్గంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా పర్యాటకులు ప్రయాణించవచ్చు.
- కల్యాణ్, ఆపరేషన్స్ మేనేజర్, ఇంచ్కేప్ షిప్పింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్