
తెలంగాణ
ఏపీజీఈఎఫ్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి
ఈనాడు డిజిటల్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు 11వ పీఆర్సీలో 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏపీజీఈఎఫ్) ఛైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం 27 శాతం ఫిట్మెంట్ ఇస్తామంటే అంగీకరించబోమన్నారు. 2018 జులై నుంచి 11వ వేతన సవరణ అమలు చేయాలని, 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్ (పెరిగిన వేతనం) ఇవ్వాలని కోరారు. 2022 జనవరి నుంచి వేతనంతో కలిపి చెల్లించాలని డిమాండ్ చేశారు. డిసెంబరు 10లోపు పీఆర్సీ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నామని, అలా జరగకుంటే తదుపరి కార్యాచరణ ప్రకటించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య శనివారం విజయవాడలో సమావేశమైంది. పీఆర్సీ ఫిట్మెంట్ తదితర అంశాలపై వివిధ సంఘాలతో చర్చించిన అనంతరం.. వెంకట్రామిరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. వేతన సవరణపై ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారన్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామని, పది రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన అధికారులకు చెప్పారని వివరించారు.