
తెలంగాణ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో డిసెంబరు నెలాఖరు నాటికి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. పల్లె దవాఖానాల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలన్నారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో రెండు వారాల్లోగా క్యాథ్ల్యాబ్లను సిద్ధం చేయాలని సూచించారు. ఖమ్మంలో డిసెంబరు రెండో వారానికి ల్యాబ్ పనులు పూర్తి చేసి, ప్రారంభించాలన్నారు. శనివారమిక్కడ వైద్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు సిద్ధం చేసుకోవాలని, ఇక నుంచి ప్రతినెలా విభాగాల వారీగా సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ‘‘అధికారుల పనితీరులో నెలవారీ వృద్ధిరేటు కనిపించాలి. మెరుగైన పనితీరు కనబరిచినవారికి పదోన్నతులు, ప్రోత్సాహకాలు ఉంటాయి. మలేరియా, డెంగీ ప్రభావిత జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పరిసరాల పరిశుభ్రతతో పాటు దోమల నివారణ చర్యలు చేపట్టాలి. రాష్ట్రంలో అందిస్తున్న టీ-డయాగ్నస్టిక్ సేవల పరిశీలనకు వచ్చేవారం యూపీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల బృందాలు రానున్నాయి’’ అని మంత్రి పేర్కొన్నారు.