
ఆంధ్రప్రదేశ్
మూక దాడిలో గాయపడ్డ సైదాను పరామర్శించిన తెదేపా నేతలు
నరసరావుపేటలో చికిత్స పొందుతున్న సైదాకు నగదు అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే యరపతినేని, మాజీ మంత్రి పుల్లారావు
నరసరావుపేట పట్టణం, న్యూస్టుడే: తెదేపా నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. వైకాపా కార్యకర్తల దాడిలో గాయపడి గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న సైదాను ఆదివారం తెదేపా నేతలు పరామర్శించి రూ.50 వేల నగదు అందజేశారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. వరదలు వచ్చిన ప్రాంతాల్లో ఇంతవరకూ అధికారులు నష్టం అంచనా వేయకపోవడం బాధాకరమన్నారు. రైతులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ వైకాపా దుండగులు తెదేపా నాయకులు, కార్యకర్తలపై పైశాచిక దాడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తెదేపా కార్యకర్తలపై తప్పుడు కేసులు, హత్యకేసులు మోపి జైళ్లకు పంపారన్నారు. ఇప్పటివరకు 80 మంది తెదేపా కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని వివరించారు. వారం రోజుల క్రితం సైదాపై దాడిచేస్తే పోలీసులు 324 కేసు పెట్టారని తెదేపా ఆందోళన చేస్తే 307 సెక్షన్ నమోదు చేశారన్నారు.