
ఆంధ్రప్రదేశ్
తొలగించాలంటూ మహిళల ఆందోళన
మద్యం దుకాణం వద్ద ఆందోళన చేస్తున్న మహిళలు
కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే: కర్నూలులోని ఉల్చాలరోడ్డు వై-జంక్షన్ నుంచి మద్యం దుకాణాన్ని కాలనీ వద్దకు మార్చడంతో స్థానిక మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం దుకాణం తొలగించాలని డిమాండు చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో ఆదివారం దుకాణాన్ని ముట్టడించారు. రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర నాయకురాలు నిర్మల మాట్లాడుతూ.. క్రమంగా మద్యం దుకాణాలు తగ్గించి మద్యనిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసిందని మండిపడ్డారు. పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు ఉండే ప్రదేశంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల మహిళలు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారన్నారు. దుకాణం మార్పు చేసేందుకు గడువు ఇవ్వాలని అధికారులు కోరగా నిరాకరించారు. చివరకు దుకాణం మూసివేయడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా కార్యదర్శి అలివేలు, సీపీఎం నాయకులు జమ్మన్న, షబానా, లత, మమత, అనసూయ తదితరులు పాల్గొన్నారు.