
ఆంధ్రప్రదేశ్
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సౌజన్యం
కొత్త యంత్రం వద్ద బర్డ్ డైరెక్టర్ ధర్మారెడ్డి, దాత వెంకటేష్ దంపతులు
తిరుపతి(వైద్యవిభాగం), న్యూస్టుడే: తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రిలో అధునాతన రూఫ్ సస్పెండెడ్ అల్ట్రా మోడరన్ డిజిటల్ ఎక్స్రే యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. రూ.1.30 కోట్ల విలువైన ఈ యూనిట్ను రెండు తెలుగు రాష్ట్రాల్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అధినేత పి.వెంకటేష్, సుజాత దంపతులు విరాళంగా అందజేశారు. దీనిని దాత ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తితిదే అదనపు ఈవో, ఆస్పత్రి సంచాలకుడు ఏవీ ధర్మారెడ్డి దాత వెంకటేష్ను సన్మానించారు. కదలలేని రోగులు, ప్రమాద బాధితులకు ఈ యంత్రం ఉపయోగంగా ఉంటుంది. ఎక్స్రే కోసం యంత్రం ముందు అటూఇటూ తిరగాల్సిన అవసరం లేదని, ఇందులోని పరికరాలే కదులుతూ అత్యంత నాణ్యంగా పరీక్షిస్తాయని వైద్యులు తెలిపారు. ఈ తరహా యంత్రం రాయలసీమలో ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ లేదు. బర్డ్ ఆస్పత్రిలో ఇప్పటికే సువర్ణ సాఫ్ట్వేర్ అందుబాటులోకి రావడంతో.. రోగిని ఎక్స్రే తీసిన కొన్ని నిమిషాల్లోనే ఆ ఫొటో ఎక్స్రే కన్సల్టింగ్ వైద్యుల వాట్సప్నకు చేరుతుంది. త్వరగా వైద్యం అందించే అవకాశం ఏర్పడింది. ఆస్పత్రి ప్రత్యేకాధికారి రెడ్డెప్పరెడ్డి, ఆర్ఎంవో కిశోర్కుమార్, వైద్యులు రామ్మూర్తి, వేణుగోపాల్, దీపక్, ఏఈవో పార్థసారథి, మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.