
ఆంధ్రప్రదేశ్
వయోజనులతోపాటు చిన్నారుల్లోనూ ఊబకాయం
తేల్చిచెప్పిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే
దిల్లీ
జన భారతం లావెక్కుతోంది! చిన్న-పెద్ద, ఆడ-మగ తేడా లేకుండా దేశవ్యాప్తంగా 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అనేక మంది బరువు పెరుగుతున్నారు. తాజాగా నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్-5) ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
వయోజనులతోపాటు ఐదేళ్లలోపు చిన్నారుల్లోనూ ఊబకాయం బాధితులు పెరుగుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానంగా శారీరక శ్రమ తగ్గడం, అనారోగ్యకర ఆహార అలవాట్లే అధిక బరువుకు కారణమవుతున్నట్లు గుర్తించింది. 2015-16 మధ్య నిర్వహించిన ఎన్ఎఫ్హెచ్ఎస్-4 సర్వేతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, మిజోరం, త్రిపుర, లక్షద్వీప్, జమ్మూ-కశ్మీర్, ఉత్తర్ ప్రదేశ్, దిల్లీ, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్ఎఫ్హెచ్ఎస్-5 నాటికి ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఊబకాయం బాధితుల శాతం పెరిగింది. గోవా, తమిళనాడు, దాద్రా-నగర్ హవేలీ, దమణ్దీవ్ల్లో మాత్రం చిన్నారుల్లో అధిక బరువున్నవారి శాతం తగ్గింది. 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళల్లో ఊబకాయుల శాతం మునుపటి సర్వేతో పోలిస్తే అధికంగా నమోదైంది. 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పురుషుల్లో అధిక బరువున్నవారి శాతం పెరిగింది. తాజా సర్వేపై ‘పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనమ్ ముత్రేజా స్పందిస్తూ.. ఆదాయం పెరిగేకొద్దీ ప్రజల్లో అనారోగ్యకర ఆహార అలవాట్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. పిల్లల ఆహార అలవాట్లపై తల్లిదండ్రులు మరింత శ్రద్ధ పెట్టాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు.