
తెలంగాణ
ఈనాడు, హైదరాబాద్: నీటిపారుదల శాఖలో సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్ల(ఏఈఈ)కు పదోన్నతుల దస్త్రం సిద్ధమైంది. ఈ ఏడాది జవనరిలోనే శాఖ అంతర్గత పదోన్నతుల కమిటీ(డీపీసీ) 250 పోస్టులపై స్పష్టతనిచ్చింది. ఇందులో భాగంగా 130 మంది ఏఈఈల జాబితాను సిద్ధం చేశారు. అయితే, క్షేత్రస్థాయిలో ఏఈఈల కొరత ఉండటంతో పదోన్నతులు కల్పిస్తే పోస్టుల ఖాళీలు ఏర్పడి ప్రాజెక్టుల పనులకు ఇబ్బందులు వస్తాయని సీఈలు సూచించడంతో ఆ ప్రక్రియను నిలిపివేశారు. మరోవైపు డీపీసీ ఆమోదం పొందిన జాబితా గడువు ఆగస్టు 31కి పూర్తవడంతో మరో 4 నెలలు పొడిగించారు. వచ్చే నెలతో అదీ పూర్తికానుంది. ఈలోగా పదోన్నతులు పూర్తిచేయాలని ఏఈఈలు కోరుతున్నారు. నీటిపారుదల శాఖ దస్త్రాన్ని ప్రభుత్వానికి పంపింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందున అవసరమైతే ఎన్నికల కమిషన్ వివరణ తీసుకుని పదోన్నతులు పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది.
700 పోస్టుల్లో నియామకాలు ఎప్పుడో..
నీటిపారుదల శాఖలో క్షేత్రస్థాయిలో 2,796 ఏఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 1200 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా 700 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. వీటి భర్తీని ఇంటర్వ్యూ పద్ధతిలో చేపడితే ఎంపికకు ఎక్కువ సమయం పడుతుందన్న అభ్యంతరం నేపథ్యంలో నీటిపారుదల శాఖ దీనిపై అభిప్రాయం తీసుకునేందుకు ఈ ఏడాది జూన్ 21న సాధారణ పరిపాలన శాఖకు దస్త్రాన్ని పంపింది. దీంతోపాటు ఆర్థిక శాఖకూ వెళ్లింది. అప్పటి నుంచి దస్త్రం వెనక్కి రాకపోవడంతో ఏఈఈ పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇది పరోక్షంగా ఏఈఈల పదోన్నతులపై ప్రభావం చూపుతోంది.