
ఫీచర్ పేజీలు
వారణాసి నగరాన్ని బ్రహ్మదత్తుడు పాలిస్తున్న రోజుల్లో.. బోధిసత్వుడు అరణ్యంలో దున్నపోతుగా జన్మించాడు. దయాస్వభావుడైన ఆయన్ను ఓ కోతి ఇబ్బందిపెట్టేది. మహిషం నిద్ర పోతుంటే దానిపైకి దూకడం, కొమ్ములు పట్టుకుని తిప్పడం, చెవుల్లో పుల్లలు దూర్చడం లాంటివి చేసి ఆనందించేది. ఇదంతా గమనిస్తున్న ఓ యక్షుడు బోధిసత్వుణ్ణి సమీపించి.. ‘ఓ మహిషమా! కొండల్ని పిండి చేసే బలం నీకున్నా, ఈ కోతిని ఎందుకు భరిస్తున్నావు?’ అనడిగాడు.
దానికి మహిషరూపంలో ఉన్న బుద్ధుడు ‘నిజమే.. నేనీ కోతిని చంపడానికి క్షణకాలం పట్టదు. కానీ దానివల్ల నాకొచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ. దుర్బలులపై వీరత్వం చూపి నా బలాన్ని తక్కువ చేసుకోలేను. గుణపరాభవం కన్నా వ్యక్తి పరాభవం మేలు. ఎట్టి స్థితిలోనూ క్షమ, ఓర్పులను కోల్పోకూడదు. అందుకే ఈ కోతిని క్షమిస్తున్నాను’ అన్నాడు.
దాంతో యక్షుడు ‘తమరు సంపూర్ణ సాధు స్వభావులు’ అంటూ ప్రశంసించి, కోతిని అక్కణ్ణించి తరిమి మహిషం బాధ తొలగించాడు.
- ఎ.ఎం.నాగప్రసాద్