
తెలంగాణ
రహదారిపై ద్విచక్ర వాహనంలా దూసుకెళుతూ..
ఆదిలాబాద్ పట్టణం పాత హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన చంద్రకాంత్ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తుండేవారు. 2018 జూన్లో ఒక్కసారిగా తీవ్రమైన వెన్నునొప్పి వచ్చింది. రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. ఆరునెలల వైద్యం అనంతరం... ఇలాగే జీవించక తప్పదని డాక్టర్లు చెప్పారు. ఆ సమయంలో భార్య శాంత ధైర్యం చెప్పి.. సపర్యలు చేస్తూ అండగా నిలిచింది. తీవ్రమైన ఆవేదన. బయటి ప్రపంచాన్ని చూసే అవకాశం లేకుండా పోయింది. బయటకు వెళ్లాలంటే ఇద్దరి సహాయంతో ఆటో ఎక్కాల్సి వచ్చేది. దీనికి పరిష్కారమేంటని ఆయన అంతర్జాలంలో వెతికారు. అలా ఐఐటీ మద్రాస్ వారు రూపొందించిన న్యూబోల్డ్ వీల్ఛైర్ గురించి తెలిసింది. ఎలా పని చేస్తుందో వీడియోలు చూసిన తరువాత రూ.95,000 ఖర్చుచేసి కొనుగోలు చేశారు. ‘మొదటి సారిగా ఈ బండి నడిపేటప్పుడు నా కళ్ల వెంట నీరొచ్చేసింది. బాహ్య ప్రపంచాన్ని చూడడానికి రెక్కలు వచ్చినట్టే అనిపించింది. ఇంట్లో వీల్ఛైర్లా.. బయట ద్విచక్ర వాహనంలా ఉపయోగపడుతోంది. నాలుగు గంటలు ఛార్జింగ్ పెడితే సుమారు 30 కిలోమీటర్లు దూరం ప్రయాణించవచ్చు. ఎవరి సాయం లేకుండా వీల్ఛైర్కు అనుసంధానం చేసుకోచ్చు. తొలగించుకోవచ్చు. ప్రస్తుతం ఇంటికి సంబంధించిన చిన్న పనులన్నీ సొంతంగా చేసుకుంటున్నాను.’ అంటున్నారు చంద్రకాంత్.
- ఈనాడు, ఆదిలాబాద్