
తెలంగాణ
బలవంతంగా బయటకు పంపిన అధికారులు
మహిళను బలవంతంగా తీసుకెళుతున్న కానిస్టేబుళ్లు
కురవి, న్యూస్టుడే: తమకు రెండు పడకగదుల ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వాటిలోకి పలువురు మహిళలు ప్రవేశించగా.. వారిని పోలీసులు బలవంతంగా బయటకు పంపించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి లో బుధవారం చోటుచేసుకుంది. కురవిలో ప్రభుత్వం ఏడాది క్రితం రెండు పడకగదుల ఇళ్లు 30 నిర్మించింది. వాటిని లబ్ధిదారులకు కేటాయించలేదు. బుధవారంపలువురు మహిళలు ఆ గృహాల్లోకి ప్రవేశించారు. ఇన్ఛార్జి తహసీల్దార్ తరంగిణి అక్కడికి చేరుకుని లబ్ధిదారులను ఎంపిక చేసి, అర్హులకు కేటాయిస్తామని నచ్చజెప్పారు. మహిళలు ససేమిరా అన్నారు. దీంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మహబూబాబాద్ రూరల్ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు వారిని బలవంతంగా గృహాల్లోంచి బయటకు పంపించారు. కొంతమంది బయటకు రావడానికి నిరాకరించడంతో పోలీసులే స్వయంగా సామగ్రిని బయటకు తరలించారు. ఇళ్లకు రెవెన్యూ అధికారులు తాళాలు వేశారు. గృహాల ముందు మహిళలు బైఠాయించగా.. వారిని మహిళా పోలీసులు మినీ బస్సులో ఎక్కిస్తుండగా కొంత ఉద్రిక్తత ఏర్పడింది. సమస్యను ఎమ్మెల్యే రెడ్యానాయక్, కలెక్టర్ శశాంక దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని మహిళలు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. వారిని కురవి ఠాణాకు తరలించి, కౌన్సెలింగ్ చేసి పంపించారు.