
గ్రేటర్ హైదరాబాద్
అత్యధికంగా నల్గొండలో 2.36 మీటర్ల లోతుకు..
ఈనాడు, హైదరాబాద్ : రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు తగ్గుతున్నాయి. 2021 అక్టోబరుతో పోలిస్తే నవంబరులో జిల్లావారీగా చూస్తే 0.29 మీటర్ల నుంచి 2.36 మీటర్ల దాకా తగ్గుదల ఉన్నట్లు భూగర్భ జలశాఖ బుధవారం విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో గత అక్టోబరులో సగటున 4.17 మీటర్ల లోతున భూగర్భ జలాలుంటే నవంబరు కల్లా అవి 6.53 మీటర్లలోతుకు పడిపోయాయి. జోగులాంబ గద్వాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వనపర్తి, యాదాద్రి తప్ప మిగతా అన్ని జిల్లాల్లో స్వల్పంగా తగ్గుదల నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా జగిత్యాల జిల్లాలో సగటున 2.80 మీటర్ల లోతునే జలమట్టాలున్నాయని వివరించింది. మొత్తం 1,115 ప్రాంతాల్లో ఫీజోమీటర్లతో జలమట్టాలను లెక్కించారు. గత దశాబ్దకాలం(2011 నవంబరు)తో పోలిస్తే 411 మండలాల్లో 2 మీటర్ల కన్నా ఎక్కువగా జలమట్టాలు పెరిగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పశ్చిమ ప్రాంతంలోని 3 మండలాల్లో మాత్రమే దశాబ్దం క్రితంతో పోలిస్తే 2 మీటర్లలోతు అదనంగా తగ్గాయి.