
గ్రేటర్ హైదరాబాద్
తీవ్ర వాయుగుండంగా మారి ఒడిశా దిశగా ప్రయాణం
ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డుపైకి చొచ్చుకొస్తున్న కెరటాలు
ఈనాడు, న్యూస్టుడే యంత్రాంగం: ఉత్తరాంధ్రకు జవాద్ తుపాను ముప్పు తప్పింది. శనివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ ఆదివారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ తీరానికి చేరనుంది. అప్పటికి ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారనుందని వాతావరణశాఖ తెలిపింది. తుపాను బలహీనపడినా దాని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సంచాలకులు సునంద వెల్లడించారు. జవాద్ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పలు మండలాల్లో శనివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిశాయి. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లిలో సముద్రం 120 అడుగులు ముందుకొచ్చింది. తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ- కాకినాడ బీచ్రోడ్డుపై అలల తీవ్రతకు నీరు నేరుగా రహదారిపై చొచ్చుకొచ్చింది. తుపాను గాలులకు శ్రీకాకుళం జిల్లాలో కొబ్బరిచెట్టు కూలి పడి ఓ యువతి మృతి చెందింది.