
గ్రేటర్ హైదరాబాద్
ఈనాడు, హైదరాబాద్: విద్యుత్ వాహనాల వినియోగానికి ప్రోత్సాహం అందించడంతోపాటు ఛార్జింగ్ అవసరాలు, ఇంధన నిల్వ హబ్కు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘ఈ-వాహనాలకు ప్రోత్సాహం’పై గోవాలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ తరఫున ఆయన పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, ముఖ్యకార్యదర్శులు, పరిశ్రమల ప్రముఖులు, సాంకేతిక నిపుణులతో జరిగిన ఈ సమావేశంలో దేశంలో విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహం, పెట్టుబడులను ఆకర్షించే మార్గాలపై చర్చించారు. ఈ వాహనాల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమావేశంలో మంత్రి పువ్వాడ వివరించారు. ‘‘దిల్లీ, గుజరాత్ తరువాత ఈ-వాహనాలు, ఇంధన నిల్వ విధానాన్ని అమలుచేస్తున్న మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రాష్ట్రంలో ఈ వాహనాలు కొని రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి అనేక రాయితీలు, వాటి తయారీ, వినియోగానికి ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తోంది. 20 వేల ఆటోలు, 10 వేల తేలికపాటి రవాణా వాహనాలు, 5 వేల కార్లు, మొదటి 500 బస్సులకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తున్నాం’’ అని గోవా రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వెల్లడించారు.