
తెలంగాణ
తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 5 నుంచి 26 వరకు కార్యక్రమాలు
నారాయణగూడ, న్యూస్టుడే: అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో 17వ మహాసభలు, యువ సమ్మేళనం 2022 జులై 1 నుంచి మూడు రోజుల పాటు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతాయని ఆటా అధ్యక్షుడు భువనేష్ భూజాల వెల్లడించారు. ఈ ఉత్సవాలకు ముందు మాతృదేశంలో ఆనవాయితీగా నిర్వహించే ‘ఆటా వేడుకలు, సేవా డేస్’ కార్యక్రమాలు డిసెంబరు 5 నుంచి 26వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఆదివారం చాపెల్రోడ్డులోని స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్ కళాశాల సమావేశ మందిరంలో గోడపత్రిక ఆవిష్కరణ సభ నిర్వహించారు. ఆటా ప్రెసిడెంట్ ఎలక్ట్ మధు బొమ్మినేని తమ కార్యక్రమాల గురించి వివరించారు. డిసెంబరు 6న వనపర్తిలో పశువైద్యశాల ప్రారంభోత్సవం, 7న నల్గొండలో వైద్య శిబిరం, 8న భువనగిరిలో ఆరోగ్య, నేత్ర శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 10న హైదరాబాద్లోని అనాథాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు ఉంటాయన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో, గ్రామాల్లో కూడా నిర్వహిస్తున్నామన్నారు. డిసెంబరు 26న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఆటా వేడుకల మహోత్సవం ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఆటా ఇండియా కోఆర్డినేటర్ జోత్స్నారెడ్డి, మాజీ అధ్యక్షుడు కరుణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.