
జాతీయ- అంతర్జాతీయ
వాషింగ్టన్: కరోనా వైరస్కు ఉచ్చువేసి పట్టేసే ఒక బబుల్ గమ్ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఇది రోగి లాలాజలంలో వైరల్ లోడును తగ్గిస్తుంది. తద్వారా వ్యాధి వ్యాప్తికి కళ్లెం వేస్తుంది. అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. లాలాజల గ్రంథుల్లో కరోనా వైరస్ తన ప్రతులను ఉత్పత్తి చేసుకుంటుంది. పూర్తి స్థాయిలో టీకా పొందిన వ్యక్తి లాలాజలంలోనూ వైరల్ లోడు ఎక్కువగానే ఉండొచ్చు. అందువల్ల కొవిడ్ సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా కొంత మేర వైరస్ బయటకు వస్తుంది. అది ఇతరులకు ఇన్ఫెక్షన్ కలిగించొచ్చు. ఈ అంశంపై హెన్రీ డేనియల్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. నిజానికి కొవిడ్ ఆరంభానికి ముందు నుంచే అధిక రక్తపోటుకు చికిత్సగా ఏసీఈ2 అనే ప్రొటీన్ను ఉపయోగించే అంశంపై వీరు దృష్టి సారించారు. ఇందుకోసం ఈ ప్రొటీన్ను ల్యాబ్లో వృద్ధి చేశారు. మొక్కలను ఉపయోగించడం ద్వారా ఈ ప్రక్రియను చౌకలో పూర్తిచేయగలిగారు. తీవ్రస్థాయి ఇన్ఫెక్షన్లు ఉన్నవారిలో ఏసీఈ2 ఇంజెక్షన్ల వల్ల వైరల్ లోడు తగ్గుతుందని మునుపటి పరిశోధనల్లో తేలింది. ఈ ప్రొటీన్ ద్వారానే కరోనా వైరస్.. మానవుల్లో ఇన్ఫెక్షన్ కలిగిస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క మొక్కల సాయంతో డేనియల్ వృద్ధి చేసిన ప్రొటీన్లతో కూడిన బబుల్ గమ్ ద్వారా దంతాలపై పాచిని నిర్మూలించొచ్చని తేల్చారు. ఈ సూత్రాన్ని ప్రయోగించి లాలాజలంలో కరోనా వైరస్ను తగ్గించొచ్చా అన్నది పరిశీలించారు. మొక్కల నుంచి వృద్ధి చేసిన ప్రొటీన్ను.. దాల్చిన చెక్క ఫ్లేవర్తో కూడిన బబుల్గమ్లో కలిపారు. దీన్ని నమిలిన కొవిడ్ రోగుల స్వాబ్లో వైరల్ లోడు తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.