
తెలంగాణ
బాధ్యత వహించాలి: మంద కృష్ణ మాదిగ
అంబేడ్కర్ విగ్రహం వద్ద మాట్లాడుతున్న కృష్ణ మాదిగ
ఈనాడు, దిల్లీ: అంబేడ్కర్ వర్ధంతి రోజున దిల్లీలోని ఏపీ, తెలంగాణభవన్లలో ఆయన విగ్రహానికి అధికారులు పూలమాలలు వేయకపోవడం, నివాళులర్పించనందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధ్యత వహించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రెండు భవనాల అధికారులు పూలమాలలు వేయలేదు. విషయం తెలుసుకున్న కృష్ణమాదిగ విగ్రహం వద్దకు వచ్చి నివాళులర్పించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విగ్రహానికి పూలదండ వేయకపోవడంపై అధికారులను ప్రశ్నిస్తే రాష్ట్రాల నుంచి ఆదేశాలు రాలేదంటున్నారన్నారు. ఒకవేళ అదే నిజమైతే బాధ్యులైన రెండు రాష్ట్రాల సాంఘిక సంక్షేమశాఖల ముఖ్య కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదేశాలు ఇచ్చినా ఇక్కడ పాటించకపోతే రెండు భవన్ల రెసిడెంట్ కమిషనర్లపై చర్యలు తీసుకోవాలన్నారు.
కృష్ణ మాదిగ నిరసన తెలుపుతున్న సమయంలోనే అక్కడికి చేరుకున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్కు సీఎం కేసీఆర్ ఏనాడూ నివాళులర్పించలేదని సంజయ్ విమర్శించారు. అనంతరం అక్కడికి వచ్చిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారశైలికి అనుగుణంగానే తెలంగాణ భవన్ అధికారుల తీరు ఉందన్నారు. ఆ సమయంలోనే తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ వచ్చి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనాసక్సేనా నివాళులర్పించారు.