
తెలంగాణ
సీబీఐ దర్యాప్తు జరిపించండి.. కేంద్రాన్ని కోరిన ఎంపీ అర్వింద్
ఈనాడు, దిల్లీ: తెలంగాణలో బియ్యం మిల్లింగ్ ప్రక్రియలో వేలకోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కొందరు మిల్లర్లు పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన రీసైకిల్డ్ బియ్యాన్ని ఎఫ్సీఐకి సరఫరాచేసి భారీగా దండుకుంటున్నారని ఆరోపించారు. సోమవారం లోక్సభ జీరో అవర్లో ఆయన ఈ విషయమై మాట్లాడారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కారణంగా అక్కడి రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంతో ఒప్పందం చేసుకున్నప్పటికీ ఆ పనిచేయకపోవడంతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సేకరణలో జాప్యం కారణంగా వర్షాకాలంలో ధాన్యం దెబ్బతిని రైతులకు కోలుకోలేని నష్టం జరుగుతోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చే ప్రక్రియలో భాగంగా మిల్లర్లకు పంపిణీచేస్తుండగా, పాత మిల్లర్లు ఈ ధాన్యాన్ని కొత్త మిల్లర్లకు క్వింటాలు ఒక్కంటికి రూ.1,600 చొప్పున ఇస్తున్నారు. వాళ్లు వాటిని మిల్లింగ్ చేసి కిలో రూ.40 లెక్కన జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ఇంకోవైపు పాత మిల్లర్లు ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి రీసైకిల్డ్ బియ్యాన్ని కిలో రూ.18కి కొనుగోలుచేసి, 100 కిలోల వడ్లకు బదులు 67 కేజీల బియ్యాన్ని ఎఫ్సీఐకి అందిస్తున్నారు. ఇందుకోసం మిల్లర్లు రూ.1,206 ఖర్చుచేస్తున్నారు. మిల్లింగ్ సహా ఇతర ఎలాంటి శ్రమ లేకుండానే వాళ్లు ఒక్కో క్వింటాలుకు దాదాపుగా రూ.400 ఆర్జిస్తున్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపి, తగిన చర్యలు తీసుకోవాలి’’ అని అర్వింద్ డిమాండ్ చేశారు.