
తెలంగాణ
ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్టుడే: రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల సీట్ల భర్తీకి నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష(సీపీజీఈటీ-2021)లో 23,647 మంది విద్యార్థులకు తొలి విడత సీట్లు కేటాయించారు. సెట్ కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి సోమవారం వివరాలను విడుదల చేశారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్టీయూ యూనివర్సిటీల్లో మొత్తం 47,925 సీట్లు ఉండగా.. మొదటి విడతలో 32,400 మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారిలో 23,647 మందికి సీట్లు కేటాయించారు. 24,278 సీట్లు ఖాళీగా ఉన్నాయి. తొలి విడతలో సీట్లు సాధించిన విద్యార్థులు ఈ నెల 10లోపు తమకు కేటాయించిన కళాశాలలో రిపోర్టు చేయాలి. ఆ కళాశాలలోనే ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలి. కేటాయించిన సీట్లు నచ్చకపోతే కళాశాలలో రిపోర్టు చేయాల్సిన అవసరం లేదని, కళాశాలలో రిపోర్టు చేసిన అభ్యర్థులు కూడా రెండో విడ]తలో ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉంటుందని ప్రొ.పాండురంగారెడ్డి తెలిపారు. పూర్తి వివరాలను http://www.tscpget.com లో చూడాలని వివరించారు. అత్యధికంగా ఎంకామ్లో 3,020 మందికి, ఎమ్మెస్సీ రసాయన శాస్త్రంలో 2,775 మందికి, గణితంలో 2,249 మందికి సీట్ల కేటాయించారు.