
గ్రేటర్ హైదరాబాద్
ఈడీ దర్యాప్తు ముగిసినట్లే
ప్రాథమిక ఆధారాలూ లభించని ఫలితం
ఈనాడు, హైదరాబాద్: సంచలనం సృష్టించిన టాలీవుడ్ మత్తుమందుల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేపట్టిన దర్యాప్తు తుస్సుమంది. మత్తుమందుల దిగుమతితో పాటు నిధుల మళ్లింపు వ్యవహారం నిగ్గు తేల్చేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. వీటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు మూసేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియ ఆరంభించే అవకాశముంది. 2017లో ఆబ్కారీశాఖ నమోదు చేసిన కేసులతో టాలీవుడ్ మత్తుమందుల వ్యవహారం తొలుత తెరపైకి వచ్చింది. సుదీర్ఘంగా సాగిన ఈ దర్యాప్తులోనూ చెప్పుకోదగ్గ ఆధారాలేవీ లభించలేదు. ఇప్పుడు ఈడీ దర్యాప్తూ ఇలానే ముగిసిపోనుంది.
నాలుగేళ్ల క్రితం అంటే 2017 జులైలో ఆబ్కారీ అధికారులు కెల్విన్ మార్కెరాన్స్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతడి నుంచి మత్తుమందులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అనేక మందికి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు అతడు వెల్లడించాడు. దాంతో కలకలం రేగింది. దర్యాప్తులో భాగంగా అప్పటి ఆబ్కారీశాఖ సంచాలకులు అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో టాలీవుడ్కు చెందిన అనేక మందిని విచారించారు. వారి వాంగ్మూలం నమోదు చేశారు. మత్తుమందులు వాడుతున్నదీ, లేనిదీ శాస్త్రీయంగా నిర్ధారించేందుకు వీరిలో కొందరి గోళ్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. అన్ని కోణాల్లో దర్యాప్తుతో పాటు సాక్షులనూ విచారించారు. దాదాపు మూడేళ్లపాటు దర్యాప్తు చేసినా మత్తుమందుల వాడకంపై ప్రాథమిక ఆధారాలూ లభించలేదు. ఆబ్కారీ దర్యాప్తు ముగిసిన తరుణంలో అకస్మాత్తుగా ఈడీ అధికారులు తెరపైకి వచ్చారు. వ్యవహారంపై మళ్లీ కొత్తగా గత ఆగస్టులో కేసు నమోదు చేశారు. డ్రగ్స్ దిగుమతితో పాటు విదేశాలకు నిధుల మళ్లింపు కోణంలో దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రవితేజ, రానా, ఛార్మి, రకుల్ప్రీత్సింగ్ వంటి 12మందిని విచారించారు. వారందరి బ్యాంకు లావాదేవీలు పరిశీలించారు. ఆగస్టు 31న మొదలైన ఈ విచారణ సెప్టెంబరు 22 వరకూ కొనసాగింది. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపినా కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దాన్ని మూసివేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.