
గ్రేటర్ హైదరాబాద్
ఈనాడు, హైదరాబాద్: కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయుల విభజనపై మార్గదర్శకాలు జారీ అయిన నేపథ్యంలో సీనియారిటీ జాబితా తయారీపై విద్యాశాఖ దృష్టి సారించింది. కేడర్ విభజనపై సవరణలు ఉంటే తెలియజేయాలని, పాత జిల్లాల వారీగా సీనియారిటీ జాబితా రూపొందించాలని ఉన్నతాధికారులు మంగళవారం సాయంత్రం డీఈవోలను ఆదేశించారు. ఈ నెల 9న విద్యాశాఖ కార్యదర్శి సుల్తానియా డీఈవోలతో సమావేశమై వివిధ అంశాలపై మార్గనిర్దేశం చేయనున్నారు. పలు ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఈ ప్రక్రియ పూర్తి కాదని అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. విద్యా సంవత్సరం మధ్యలో ఉపాధ్యాయులను బదిలీ చేస్తే విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతుందన్న వాదన ఉంది. 2009లో పదోన్నతులు ఇచ్చినా ఉన్నచోటే పనిచేసేలా ఉత్తర్వులు ఇచ్చారని, ఈసారి కూడా సీనియారిటీ ప్రకారం ఆయా జిల్లాలకు కేటాయించినా విద్యా సంవత్సరం చివరిరోజు వెళ్లి చేరేలా ఉత్తర్వులు ఉండొచ్చని భావిస్తున్నారు.