
జాతీయ- అంతర్జాతీయ
సరికొత్త త్రీడీ ప్రింటర్ను రూపొందించిన భారత పరిశోధకులు
ఈనాడు, గువాహటి: నిర్మాణ రంగం నుంచి వచ్చే వ్యర్థాలతో ఫర్నీచర్ను రూపొందించడానికి గువాహటిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు ఒక త్రీడీ ప్రింటర్ను అభివృద్ధి చేశారు. ఈ ఫర్నీచర్ కోసం పారిశ్రామిక వ్యర్థాలతో కూడిన ప్రింటబుల్ కాంక్రీట్ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీని సాయంతో 0.4 మీటర్ల ఎత్తు, 0.4 మీటర్ల వెడల్పు కలిగిన వంపైన కుర్చీని నిర్మించారు. ప్రింటర్ సాయంతో పొరలు పొరలుగా ముద్రిస్తూ దీన్ని సిద్ధం చేశారు. సాధారణంగా ఇలాంటి వాటిని అచ్చులు సాయంతో తయారుచేయాల్సి ఉంటుంది. ఈ విధానంతో పోల్చితే త్రీడీ ముద్రణ వల్ల 75 శాతం తక్కువ కాంక్రీటు అవసరమవుతుంది. నిర్మాణ పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి ఈ సాంకేతికత అద్భుత పరిష్కారమవుతుందని ఐఐటీ గువాహటి డైరెక్టర్ టి.జి.సీతారామ్ తెలిపారు. ధ్రుతిమాన్ డే, దొడ్డ శ్రీనివాస్, భవేష్ చౌదరిలు ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు.