
గ్రేటర్ హైదరాబాద్
అప్నాదళ్(ఎస్)లో చేరిన హైదర్ అలీఖాన్
ఈనాడు, లఖ్నవూ: టికెట్ దక్కకపోతే అసంతృప్తితో పార్టీని వీడుతుంటారు నేతలు! ఉత్తర్ ప్రదేశ్లో మాత్రం తాజాగా అందుకు భిన్నమైన, ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టికెట్ ఖరారైనా పార్టీని వీడటం ద్వారా కాంగ్రెస్కు షాకిచ్చారు హైదర్ అలీఖాన్. ఈయన కాంగ్రెస్ సీనియర్ నేత నవాబ్ కాజిమ్ అలీఖాన్ కుమారుడు. కాజిమ్కు రాంపుర్, హైదర్కు స్వార్ టికెట్లను హస్తం పార్టీ కేటాయించింది. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ను వీడిన హైదర్.. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన అప్నాదళ్(ఎస్)లో చేరారు. ఆ కూటమి అభ్యర్థిగా స్వార్ నుంచే బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ దఫా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే తరఫున టికెట్ దక్కించుకున్న తొలి ముస్లిం అభ్యర్థిగా హైదర్ నిలిచారు. కాంగ్రెస్ టికెట్పై పోటీ చేస్తే విజయావకాశాలు తక్కువని.. అందుకే పార్టీ మారానని ఆయన చెప్పారు. మరోవైపు- తనకు కాంగ్రెస్ను వీడే యోచన లేదని కాజిమ్ స్పష్టం చేశారు. బరేలీ కంటోన్మెంట్ టికెట్ దక్కించుకున్న సుప్రియా అరోన్ కూడా ఎస్పీలో చేరడం ద్వారా ఇటీవల కాంగ్రెస్కు షాక్ ఇచ్చిన సంగతి గమనార్హం.