
సినిమా
ఇంటర్నెట్ డెస్క్: ‘తెల్లవారితే గురువారం’ చిత్ర బృందం ప్రచారాన్ని సరికొత్తగా మొదలుపెట్టింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న, చిత్రీకరణ దశలో ఉన్న దాదాపు అన్ని తెలుగు చిత్రాలకు విడుదల తేదీ ఖరారైందనే సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తమ చిత్రం ఎప్పుడొస్తుందో, టీజర్ విడుదలయ్యేది ఎప్పుడో ఓ వీడియోలో చూపించి అందరిని ఆకట్టుకుంటున్నారు ఆ చిత్ర కథానాయకుడు సింహా కోడూరి. ‘ఎలా అయినా ఈ రోజు మన సినిమాకో రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలి. ఓ పనిచేద్దాం.. అసలు ఏ డేట్ ఖాళీగా ఉందో చూద్దాం. మార్చి 11 ఎలా ఉంది? ‘జాతిరత్నాలు’ ఓకే. మేమే కొంచెం ముందుకెళ్తాం. 19.. ‘చావు కబురు చల్లగా’ నువ్వు చల్లగా ఉండు నాయనా! మేము కొంచెం ముందుకెళ్తాం. ముందుకెళ్లే కొద్దీ మనకు డేంజర్ పెరిగేలా ఉంది. ఇలా కాదు కానీ ఎలాగైనా ఈ డేట్కి వచ్చేయాలి. అదండీ మార్చి 27న. ఈ గ్యాప్ చాలు ఆడేసుకుందాం’ అని వాల్ పోస్టర్ పట్టుకుని సింహా సరదాగా చెప్పడం అలరిస్తుంది. టీజర్ని ఫిబ్రవరి 26న గం:1.24ని.లకు విడుదల చేయనున్నారు.
సింహా, చిత్రశుక్లా జంటగా మణికాంత్ జెల్లి తెరకెక్కించారు ఈ చిత్రాన్ని. రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించారు. కాల భైరవ స్వరాలు సమకూర్చారు. ‘మత్తు వదలరా’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు సింహా. తొలి ప్రయత్నంలోనే విశేషంగా ఆకట్టుకున్నారు. మంగళవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ వీడియో విడుదల చేశారు.