
తాజా వార్తలు
స్పష్టం చేసిన డీఐసీజీసీ
దిల్లీ: బ్యాంకు డిపాజిట్లపై ఖాతాదారులు రూ. లక్ష వరకే బీమా కవరేజీ పొందుతారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు సహచట్టం ద్వారా దాఖలైన దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో పేర్కొంది.
‘డీఐసీజీసీ చట్టం 1961లోని సెక్షన్ 16(1) నిబంధనల ప్రకారం.. బ్యాంకులు విఫలమైనప్పుడు, నష్టాల్లో కూరుకున్నప్పుడు ఖాతాదారుల డిపాజిట్లపై డీఐసీజీసీ రూ. లక్ష వరకు బీమా కవరేజీ అందిస్తుంది. పొదుపు, ఫిక్స్డ్, కరెంట్ ఖాతాలు, రికరింగ్ డిపాజిట్లపై ఈ బీమా వర్తిస్తుంది’ అని డీఐసీజీసీ తన సమాధానంలో పేర్కొంది. అయితే ఈ బీమా కవరేజీ పెంపుపై ప్రతిపాదనేమైనా ఉందా అని ప్రశ్నించగా.. దానికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని వెల్లడించింది.
బ్యాంకు డిపాజిట్లపై బీమా కవరేజీని పెంచేందుకు ప్రభుత్వం చట్టాలను తీసుకురానుందని ఇటీవల వార్తలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయంపై ప్రముఖ జాతీయ మీడియా సంస్థ పీటీఐ సహచట్టం ద్వారా డీఐసీజీసీకి దరఖాస్తు చేసింది. ఈ నేపథ్యంలో ఆ కార్పొరేషన్ చెప్పిన సమాధానం ప్రాధాన్యత సంతరించుకుంది.
పీఎంసీ బ్యాంక్ వ్యవహారం నేపథ్యంలో ఈ బీమా కవరేజీ ప్రాముఖ్యంగా మారిన విషయం తెలిసిందే. ఒక బ్యాంకు దివాలా తీస్తే.. ఖాతాదారులకు వచ్చే నష్టాన్ని భర్తీ చేసేందుకు ఈ బీమా సౌకర్యం అందుబాటులో ఉంది. ఖాతాదారుల నుంచి ఎటువంటి ప్రీమియం వసూలు చేయకుండానే.. బ్యాంకులు చెల్లించే ప్రీమియంతో డీఐసీజీసీ డిపాజిటర్లకు నిర్దేశించిన గరిష్ఠ మొత్తం వరకూ బీమా భద్రత కల్పిస్తోంది.