
తాజా వార్తలు
‘ఆ నటి నా భార్య.. ఎవరికీ చెప్పొద్దంది’
పెళ్లైన విషయం చెప్పకుండా మరో నటుడ్ని ప్రేమించింది..
ముంబయి: బుల్లితెర నటి పవిత్ర పునియా తన భార్య అని ఓ హోటల్ యజమాని అయిన సుమిత్ మహేశ్వరి అన్నారు. పవిత్ర ‘లవ్ యు జిందగీ’తో కెరీర్ ఆరంభించి అనేక పాపులర్ ధారావాహికలతో ఆకట్టుకున్నారు. తనకు నిశ్చితార్థమైందని, కానీ... దాన్ని రద్దు చేసుకున్నానని నటి ఓసారి చెప్పారు. కాగా పవిత్రతో వివాహమైందని, దాన్ని ఆమె రహస్యంగా ఉంచారని సుమిత్ మీడియా ముందుకు వచ్చారు. ఆమె బుల్లితెర నటుడు పరాస్ ఛబ్రాను కూడా మోసం చేశారని తెలిపారు.
‘మేము ఇప్పటికీ భార్యాభర్తలమే. మా ఇద్దరికీ నిశ్చితార్థమైంది, పెళ్లి కూడా జరిగింది. కానీ పవిత్ర బయటికి చెప్పనివ్వలేదు. నా భార్యగా ఉంటూనే పరాస్ ఛబ్రాను ప్రేమించింది. వీరి ప్రేమ గురించి తెలిసిన తర్వాత నేను పరాస్కు మెసేజ్ చేశా. పవిత్రతో ప్రేమను కొనసాగించొచ్చని.. కానీ విడాకులు వచ్చేంత వరకు ఆగమని చెప్పాను. నా కుటుంబ సభ్యులు కూడా జోక్యం చేసుకున్నారు. ఇప్పటికీ నా చేతిపై పవిత్ర టాటూ ఉంది. ఆమె పూర్తిగా మారిపోయింది, నాలో ఎటువంటి మార్పు రాలేదు. తొలుత పరాస్తో ఆమె అతి చనువుగా ఉందని తెలుసుకుని షాకయ్యా. మా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొన్న అదే గోవా హోటల్లో పవిత్ర, పరాస్ ఉన్నారని తెలుసుకుని ఎంతో బాధపడ్డా. నా భార్య వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. ఆమె ప్రేమలో నిజాయితీ లేదు’ అని సుమిత్ పేర్కొన్నారు.
పెళ్లైన మహిళ మరో పురుషుడిని ప్రేమించడం, మోసం చేయడం తప్పని బుల్లితెర నటుడు పరాస్ పవిత్రను ఉద్దేశిస్తూ కొన్ని రోజుల క్రితం అన్నారు. ‘ఆమె భర్త నాకు మెసేజ్ చేయడం వల్ల నిజం తెలుసుకున్నా. పవిత్రను ప్రశ్నిస్తే.. నిజమేనని చెప్పింది. ఆ తర్వాత ఆమె గురించి మరో షాకింగ్ విషయం తెలిసింది. ఇప్పుడు దాన్ని బయటపెట్టను’ అని చెప్పారు.