
తాజా వార్తలు
అమెరికాలో ఉద్యోగం.. ఇక్కడ దొంగతనాలు
దిల్లీ: అమెరికాలో ఉద్యోగం చేసి తిరిగి వచ్చి ఇక్కడ దొంగతనాలు చేస్తున్న ఓ వ్యక్తి నిర్వాకం దిల్లీలో బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దిల్లీకి చెందిన అవినాష్ శర్మ(60) 1990లో అమెరికాకు వెళ్లాడు. పాతికేళ్లు అక్కడే నివసించాడు. తర్వాత అక్కడి పౌరసత్వం లభించకపోవడంతో 2015లో తిరిగి భారత్కు వచ్చేశాడు. ఇక్కడికి వచ్చాక ఒక ఎలక్ట్రికల్ కంపనీలో ఉద్యోగం చేసేవాడు. కానీ తాను విలాసవంతమైన జీవనం గడపటానికి సరిపడనంత డబ్బులు రాకపోవడంతో అసంతృప్తిగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో తన స్నేహితుడు రవిగుప్తాతో చేతులు కలిపి.. రోహిత్, అమిత్ అనే వ్యక్తులతో కలిసి 2017లో ఒక గ్యాంగ్గా ఏర్పడ్డాడు. అప్పటినుంచి పెద్ద వ్యాపారవేత్తలను, కలెక్షన్ ఏజెంట్లను లక్ష్యంగా చేసుకున్నాడు. అవినాష్శర్మ పథకం రూపొందిస్తే మిగతావారు దానిని అమలు చేసేవారు. ఈ ఘటనల్లో బాధితులు ఇద్దరు క్రైంబ్రాంచ్ను ఆశ్రయించడంతో వీరిపై దృష్టి సారించారు. వీరిని పట్టుకొనేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరిని గుర్తించిన అధికారులు విజయ్విహార్లోని ఓ అపార్టుమెంట్లో అరెస్టు చేశారు. వీరి నుంచి మూడు తుపాకులు, ఒక కారును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అకౌంటెంట్ అయిన రవిగుప్తా వీరు దోచుకోవలసినవారి జాబితా తయారు చేసేవాడని పేర్కొన్నారు. దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని అనేక మంది వ్యాపారవేత్తల నుంచి వీరు సుమారు రెండుకోట్ల రూపాయల వరకూ దోచుకున్నారని వారు వివరించారు.