
తాజా వార్తలు
భార్యను నిద్రలేపి ‘కొడుకును చంపా’నన్నాడు!
మృతదేహంతో నిద్ర..
కాన్పూర్: లాక్డౌన్లో ఉద్యోగం కోల్పోయిన ఓ తండ్రి కన్న కొడుకు పాలిట యమపాశమయ్యాడు. మానసికంగా కుంగుబాటుకు గురైన ఆయన తన ఏడేళ్ల కుమారుడ్ని హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని పక్కన పెట్టుకుని నిద్రపోయాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 43 ఏళ్ల శ్రీవాస్తవ తన సతీమణి సారిక, ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి కాన్పూర్లోని సీసము ప్రాంతంలో ఉంటున్నాడు. లాక్డౌన్లో శ్రీవాస్తవ ఉద్యోగం కోల్పోయాడు. దీంతో అప్పటి నుంచి తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. కాగా సారిక ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు.
ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన శ్రీవాస్తవ కుమారుడు రుశాంక్ను చంపేశాడు. అనంతరం శనివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో భార్యను నిద్రలేపి జరిగిన విషయం చెప్పాడు. ఇప్పుడు మన కుమారుడ్ని ఎవరూ ఇబ్బందిపెట్టలేరు, అతడికి ఎలాంటి సమస్యలు ఉండవు. ప్రశాంతంగా ఉంటాడు.. అన్నాడు. దీంతో ఆందోళనకు గురైన ఆమె వెంటనే బంధువులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. పోలీసులకు కూడా సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి రుశాంక్ను భర్త చంపేశాడని సారిక పోలీసులకు వివరించింది. ఇంట్లోని ఓ గదిలో బాబు మృతదేహంతో కలిసి నిద్రపోయినట్లు చెప్పిందని పోలీసులు తెలిపారు.
ఉద్యోగం కోల్పోవడం వల్ల శ్రీవాస్తవ మానసికంగా కుంగిపోయాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయనకు కుమారుడంటే ఎంతో ప్రేమని, అపురూపంగా చూసుకునేవాడన్నారు. పిల్లల భవిష్యత్తు గురించి బాధపడుతూ ఉండేవాడని తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీవాస్తవ నేరాన్ని ఒప్పుకున్నాడు. బాబు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.