
తాజా వార్తలు
బిట్టు శ్రీను అరెస్ట్
రామగుండం: న్యాయవాద దంపతులు వామన్రావు, నాగమణి హత్య కేసులో నాలుగో నిందితుడు బిట్టు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. రెండు రోజుల క్రితమే అతడ్ని అదుపులోకి తీసుకోగా.. తాజాగా అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. న్యాయవాదుల హత్య కేసులో విచారణ కొనసాగుతోందని ఐజీ చెప్పారు. వామన్రావు, కుంట శ్రీను మధ్య చాలారోజులుగా విభేదాలు ఉన్నాయన్నారు. బిట్టు శ్రీనును వివిధ కోణాల్లో విచారించామని తెలిపారు.
‘‘వామన్రావు గురించి కుంట శ్రీను, బిట్టు శ్రీను మధ్య చర్చ జరిగేది. వామన్రావును చంపకపోతే ఇబ్బందులుంటాయని కుంట శ్రీను చెప్పాడు. తన ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకే కేసులని కుంట శ్రీను.. బిట్టు శ్రీనుతో చెప్పాడు. అవమానపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారన్నాడు. చంపేందుకు రెండు కత్తులు సిద్ధం చేయాలని చెప్పాడు. ట్రాక్టర్ పట్టీలతో కత్తులు చేయించి నిందితుడు చిరంజీవి ఇంట్లో పెట్టారు. హత్య చేసి బిట్టు శ్రీనుకు సమాచారం ఇచ్చాడు. మహారాష్ట్ర పారిపోవాలని కుంట శ్రీనుకు బిట్టు శ్రీను సూచించాడు’’ అని ఐజీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని.. అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపి ఆధారాలను శాస్త్రీయంగా విశ్లేషించాల్సిన అవసరముందని ఐజీ నాగిరెడ్డి తెలిపారు. ఇంకా కొంతమంది సాక్షులను కూడా విచారించి వారి వాంగ్మూలం నమోదు చేస్తామన్నారు. నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకొని విచారణ జరిపిన అనంతరం వారు ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలను పూర్తి స్థాయిలో నిర్ధారించాల్సి ఉందని చెప్పారు. దీనికోసం హైదరాబాద్ ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు, సైబర్ క్రైమ్ పరిశోధకులను విచారణ సహాయకులుగా తీసుకొని ముందుకెళ్తామన్నారు.