
తాజా వార్తలు
కొలువు కోసం వస్తే... ప్రాణం పోయింది
నేవీ ఎంపికల్లో కుప్పకూలిన యువకుడు
విశాఖపట్నం : దేశ రక్షణకు సంబంధించిన కొలువులో చేరాలనే తపనతో తన అక్క వివాహ ముహూర్తాన్నే మార్చుకుని... ఎంపిక పరీక్షలకు హాజరైన ఓ యువకుడు ప్రాణాలొదిలిన ఘటనపై శుక్రవారం మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, మృతుడి గ్రామానికి చెందిన వారు తెలిపిన వివరాలివి. తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం ఎలికేశ్వరం గ్రామానికి చెందిన రాళ్లబండి బక్కయ్య, కేదారీశ్వరి దంపతుల కుమారుడు సాయికృష్ణ(19) ఇండియన్ నేవీలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. దేహదారుఢ్య పరీక్ష ఉన్న రోజునే సోదరి వివాహ ముహూర్తం కుదిరింది. పరీక్ష కోసం వివాహ తేదీని డిసెంబరు 9వ తేదీకి మార్చారు.
సాయికృష్ణ తన స్నేహితుడితో కలిసి ఈ నెల 26న విశాఖ చేరుకున్నాడు. ఉదయం 10.30 గంటలకు విశాఖ పైపులైన్ జంక్షన్ వద్ద ఉన్న నేవీ మైదానంలో ఎంపిక పరీక్షలకు హాజరయ్యాడు. తొలుత 100 మీటర్ల పరుగు పూర్తి చేసి, వెంటనే పులప్స్ తీస్తుండగా... కుప్పకూలిపోయాడు. తక్షణమే నేవీ సిబ్బంది ఐఎన్ఎస్ కల్యాణి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటాక మృతి చెందినట్టు వైద్యవర్గాలు ధ్రువీకరించాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్(కింగ్జార్జ్ ఆసుపత్రి)కి తరలించారు. ఈ కేసుని సీఐ కె.దుర్గాప్రసాద్ పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో బాధిత కుటుంబంలో అంతులేని విషాదం అలుముకుంది.