
తాజా వార్తలు
దా‘రుణ’ యాప్ల కేసులో మరిన్ని ఆధారాలు
దర్యాప్తు ముమ్మరం చేసిన సైబర్ క్రైం పోలీసులు
హైదరాబాద్: డిజిటల్ సూక్ష్మ రుణ సంస్థల కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు అరెస్టు చేసిన 17 మందిని కస్టడీలోకి తీసుకొని విచారించారు. చైనాకు చెందిన లాంబో అనే వ్యక్తి రుణ యాప్లను రూపొందించడంతో పాటు వాటి ద్వారా రుణాలు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. లాంబోని ఒక రోజు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించిన పోలీసులు కొంత సమాచారాన్ని సేకరించారు. నిందితుడి చరవాణి, లాప్టాప్, ఐపాడ్లను స్వాధీనం చేసుకుని వాటిని విశ్లేషిస్తున్నారు.
లాంబో పంపిన సందేశాలు, అతనికి వచ్చిన సందేశాలు అన్నీ చైనా భాషలోనే ఉండటంతో, ఆ భాష తెలిసిన వాళ్ల సాయం తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రుణ యాప్ల బండారం బయటపడిన తర్వాత తన లాప్టాప్ నుంచి లాంబో కీలక సమాచారం తొలగించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కంప్యూటర్ నిపుణుల సాయంతో లాప్టాప్లోని సమాచారాన్ని సైబర్ క్రైం పోలీసులు పరిశీలిస్తున్నారు. బెంగళూరులో కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న నలుగురిని సైబర్ క్రైం పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. రాజేంద్రనగర్, జగిత్యాలలో చనిపోయిన ఇద్దరు వ్యక్తులు ఈ రుణయాప్ల నుంచి అప్పు తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బెంగళూరులో కాల్ సెంటర్ నిర్వాహకులపై రెండు కేసులను సైబర్ క్రైం పోలీసులు నమోదు చేశారు. ఒక కేసులో నిందితులను ఇప్పటికే కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. మరో కేసులో పీటీ వారంటుపై అదుపులోకి తీసుకొని న్యాయస్థానంలో ప్రవేశపెట్టి కస్టడీ కోరేందుకు అవకాశం ఉంది.
ఇవీ చదవండి..
దా‘రుణ’ యాప్లు: ప్రధాన సూత్రధారి అరెస్టు
అఖిలప్రియ కేసులో దర్యాప్తు ముమ్మరం