
తాజా వార్తలు
తిరుపతిలో బాలుడి అపహరణ కేసులో పురోగతి
తిరుపతి: శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చిన కుటుంబంలో నుంచి బాలుడు అపహరణకు గురైన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. గత నెల 27వ తేదీన అలిపిరిలోని బాలాజీ లింగ్ బస్టాండ్లో బాలుడు అపహరణకు గురయ్యాడు. ఓ వ్యక్తి బాలుడిని తీసుకెళ్తున్నట్లు గతంలోనే పోలీసులు సీసీటీవీ విజువల్స్లో గుర్తించారు. కానీ నిందితుడికి సంబంధించిన దృశ్యాలు అస్పష్టంగా ఉండటంతో కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. కాగా, శుక్రవారం రాత్రి నిందితుడి ఆనవాళ్లతో ఓ ఛాయా చిత్రాన్ని విడుదల చేశారు. నగరంలోని అన్నారావు సర్కిల్ సమీపంలో ఓ దుకాణం వద్ద కిడ్నాప్ చేసిన రోజే నిందితుడు ఒంటరిగా తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల కంటపడకుండా తప్పించుకునేందుకు నిందితుడు చేసిన ప్రయత్నాలు సైతం సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాలను విడుదల చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
ఛత్తీస్గఢ్లోని కురూస్ గ్రామం నుంచి ఫిబ్రవరి 23న ప్రైవేటు బస్సులో 55 మంది ఆలయాల సందర్శన నిమిత్తం బయలుదేరి వచ్చారు. వారిలో ఉత్తమ్ కుమార్ సాహు కుటుంబానికి చెందిన నలుగురిలో... శివమ్ కుమార్ సాహు(6) ఉన్నాడు. 27న తిరుపతి బాలాజీ లింకు బస్టాండుకు చేరుకుని శ్రీవారి దర్శనార్థం టోకన్లు తీసుకున్నారు. అదేరోజు స్థానిక ఆలయాలు సందర్శించి... మరుసటి రోజు ఉదయం తిరుమలకు వెళ్లేందుకు తిరిగి బాలాజీ లింకు బస్టాండు వద్దకే వచ్చారు. భోజనాలు చేసి పడుకునే సమయంలో శివమ్ కుమార్ సాహు కన్పించలేదు. చుట్టుపక్కల వెతికినా కన్పించకపోవడంతో అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ దేవేంద్రకుమార్ కేసు నమోదు చేశారు. బాలుడిని గుర్తించేందుకు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాలుడి కోసం గాలింపు చేపట్టారు. ఇందులో భాగంగానే నిందితుడు లేదా బాలుడి ఆచూకీ తెలిసిన వారు తిరుపతి పోలీస్ కమాండ్, కంట్రోల్ రూమ్ నంబర్కు 80999 99977 సామాచారం ఇవ్వాల్సిందిగా కోరారు.