
పాస్టర్ మోసం చేశాడంటూ యువతి ఫిర్యాదు
బాధితురాలికి అండగా ఉంటానన్న నటి కరాటే కల్యాణి
రాజమహేంద్రవరం(నేరవార్తలు): పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ పాస్టర్ తనను నమ్మించి మోసం చేశాడని రాజమహేంద్రవరంలో ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు సినీ నటి కరాటే కల్యాణి సహాయంతో బాధితురాలు మంగళవారం రెండోపట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది.
పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలానికి చెందిన ఓ యువతి ఆల్కట్తోట సమీపంలోని ఓ ప్రార్థనా మందిరానికి వచ్చేది. అక్కడి పాస్టర్ ఎన్జే షరోన్ కుమార్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. గట్టిగా నిలదీస్తే నగ్న వీడియోలు బయట పెడతానని.. బయటికి చెప్తే చంపేస్తానంటూ బెదిరించేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
ఈ సందర్భంగా పోలీస్స్టేషన్ ఎదుట కరాటే కల్యాణి మాట్లాడుతూ.. హైదరాబాద్ వచ్చిన బాధితురాలు ఇటీవలే తనను కలిసిందని, ఆమెకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి నేరుగా రాజమహేంద్రవరం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానన్నారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జోషి తెలిపారు.