
ఎండుఫలాల విపణి ఖాళీ!
రాష్ట్ర సరిహద్దుల్లో నిలిచిపోయిన లారీలు
రిటైల్ మార్కెట్లలో ధరలు రెట్టింపు
అబిడ్స్, న్యూస్టుడే: తెలంగాణలో హోల్సేల్ వ్యాపారానికి కేంద్రమైన బేగంబజార్లో ఎండు ఫలాలు(డ్రైఫ్రూట్స్) విక్రయించే దుకాణాలన్నీ ఖాళీ అయ్యాయి. కరోనా నేపథ్యంలో విపరీతమైన డిమాండ్ ఉండటంతో గోదాంలలో నిల్వలు నిండుకున్నాయి. దిల్లీ, ముంబయి తదితర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ఎండుఫలాల లోడ్ లారీలను రాష్ట్ర సరిహద్దుల్లోనే నిలిపివేయడంతో స్థానికంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అదనుగా రిటైల్ మార్కెట్లో ధరలు పెంచేసి అమ్ముతుండటం గమనార్హం. బేగంబజార్లో లాక్డౌన్కు ముందు బాదం ధర కిలోకు రూ.640 ఉండగా.. ప్రస్తుతం రూ.750 వరకు పలుకుతోంది. ఇక రిటైల్ మార్కెట్లో రూ.1000 నుంచి రూ.1200 వరకు విక్రయిస్తున్నారు. అక్రోట్, పిస్తా, అంజీర్, కాజూ తదితరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
బాదంకు భారీ డిమాండ్
బేగంబజార్లోని మార్కెట్లలో హోల్సేల్ ఎండుఫలాల దుకాణాలు పాతిక వరకు ఉండగా, కిరాణా హోల్సేల్ దుకాణాల్లో సైతం వీటిని విక్రయించే దుకాణాలు 200 ఉన్నాయి. బేగంబజార్ హోల్సేల్ మార్కెట్లో నిత్యం 50 టన్నులకు పైగా ఎండుఫలాల వ్యాపారం జరుగుతుందని, ఇందులో 20 టన్నులు కేవలం బాదం అమ్మకాలేనని వ్యాపారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వెంటనే చొరవ తీసుకుని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి సరిహద్దుల్లో తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ఎండు ఫలాల రవాణా వాహనాలను అనుమతించేలా చర్యలు తీసుకోవాలని వ్యాపార సంఘాల ప్రతినిధులు విన్నవిస్తున్నారు.