
కౌన్సిల్లోకి కొత్త రక్తం
81 మందికి తొలి గెలుపు
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: హోరాహోరీగా సాగిన గ్రేటర్ పోరులో నగర ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. ఈ ఎన్నికల్లో కొత్త అభ్యర్థుల వైపు మొగ్గు చూపారు. నాలుగు ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచిన 81 మంది కొత్త నేతలకు పట్టం కట్టారు. వీరిలో దాదాపు 90 శాతం తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నవారే కావడం విశేషం. గత ఎన్నికల్లో 60 శాతం కొత్త అభ్యర్థులు గెలుపొందగా.. ఈ ఎన్నికల్లోనూ దాదాపు అంతేమంది బల్దియాలో అడుగుపెట్టబోతున్నారు. అధికార తెరాస 26 మంది సిట్టింగ్ అభ్యర్థులను మార్చగా, 21 మంది విజయం సాధించారు. 149 చోట్ల పోటీ చేసిన భాజపా అభ్యర్థుల్లో 49 మంది విజయబావుటా ఎగరేశారు. వీరిలో 46 మంది తొలిసారి గెలిచినవారే. ఎంఐఎం పార్టీ 14 మంది అభ్యర్థులను మార్చగా వారిలో 11 మంది గెలిచారు. రెండు స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ ఉనికి చాటుకోగా.. ఆ ఇద్దరూ రాజకీయాల్లోకి ఈ ఎన్నికలతోనే అరంగేట్రం చేశారు. కొత్త పాలకవర్గంలో మహిళా నేతల ఆధిక్యం కనిపించనుండగా అందులో 90 శాతం తొలిసారి గెలిచినవారే.