
ఎవరైనా సంప్రదిస్తే చర్చించి చెప్తాం: ఒవైసీ
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఇప్పటివరకు ఏ పార్టీతో చర్చించలేదని ఏఐఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. మేయర్ ఎన్నికపై ఎవరైనా సంప్రదిస్తే పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గెలుపొందిన కార్పొరేటర్లతో హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒవైసీ సమావేశమయ్యారు. సమావేశంలో మాట్లాడిన ఒవైసీ, ఎన్నికల సమయంలో భాజపా ప్రచారం చేసిన తీరుపై మండిపడ్డారు. ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేసిన వార్డులోనూ భాజపా గెలవలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఏది ఏమైనా ప్రజల తీర్పును గౌరవించాలన్నారు. భవిష్యత్తులో జరగబోయే ప్రధాన ఎన్నికల్లో భాజపా అంత ప్రభావం చూపలేకపోవచ్చని అసద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో తెరాసపై ప్రజలకు అభిమానం ఉందని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కోల్పోయిన స్థానాలపై ఆ పార్టీ ఆలోచించుకోవాలన్నారు. భాజపాతో ఎంఐఎంకు ఎలాంటి పోటీ లేదని అసదుద్దీన్ స్పష్టం చేశారు.