
ఫాంహౌజ్లో రింగరింగా..
యువతులతో నృత్యాలు చేసిన మజ్లిస్నేత పర్వేజ్
వీడియోలు వైరల్.. 12 మందిపై కేసు
చిందులు వేస్తున్న పర్వేజ్
కేశవగిరి, న్యూస్టుడే: పాతబస్తీ ఉందాహిల్స్లో ఫిబ్రవరి 13న జరిగిన ఓ రేవ్పార్టీ చర్చనీయాంశంగా మారింది. మజ్లిస్ పార్టీకి చెందిన నేతలు యువతులు, హిజ్రాలతో చిందులు వేయడం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ అయ్యింది. ఈ ఉదంతంలో 12 మందిపై చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రారంభోత్సవం సందర్భంగా..
పోలీసుల కథనం ప్రకారం.. పాతబస్తీ బండ్లగూడకు చెందిన మహమ్మద్ పర్వేజ్ మజ్లిస్ పార్టీలో క్రియాశీల నేత. బండ్లగూడ గౌస్నగర్ ఉందాహిల్స్ చెరువు సమీపంలో నూతనంగా ఓ ఫాంహౌస్ నిర్మించాడు. ఫిబ్రవరి 13న ఆ ఫాంహౌస్ ప్రారంభోత్సవం సందర్భంగా రేవ్పార్టీ ఏర్పాటు చేశాడు. దీనికి మజ్లిస్ పార్టీకి చెందిన పలువురు నేతలు, పర్వేజ్ స్నేహితులు హాజరయ్యారు. రేవ్పార్టీలో నలుగురు యువతులు, నలుగురు హిజ్రాలూ పాల్గొన్నారు. పర్వేజ్ సహా మిగతా వారందరూ మద్యంతాగి వారితో చిందులు వేసినట్లుగా వీడియోలో కనిపిస్తోంది. వారితో యువతులు అశ్లీల నృత్యాలు చేసినట్లుగానూ ఉంది. ఈ మేరకు ఫలక్నుమా ఏసీపీ ఎం.ఎ.మజీద్ ఆధ్వర్యంలో చాంద్రాయణగుట్ట సీఐ రుద్రభాస్కర్, డీఐ ప్రసాద్వర్మ ఫాంహౌస్ను పరిశీలించారు. పర్వేజ్తో సహా 12 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మజ్లిస్ అధినేత సీరియస్
ఈ రేవ్పార్టీ వీడియోలను మంగళవారం ప్రత్యర్థి పార్టీల నేతలు వైరల్ చేయడంతో ఈ ఉదంతంపై మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ఒవైసీ సీరియస్గా ఉన్నట్లు సమాచారం. పర్వేజ్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.