
బాలున్ని అప్పగిస్తున్న వాలంటీర్లు
గాజులపల్లె (మహానంది), న్యూస్టుడే: తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన బాలుడు అటు.. ఇటు తిరుగుతూ ఉండగా మహిళా పోలీసులు గుర్తించి వాట్సాప్ వేదికగా తిరిగి తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన శుక్రవారం మహానందిలో చోటుచేసుకుంది. మహానంది మండలం గాజులపల్లె పెట్రోల్ బంకు సమీపంలో గుండంపాడు గ్రామానికి చెందిన కరీంబాషా మూడేళ్ల కుమారుడు మహ్మద్ సిద్ధిఖ్ అటు ఇటూ ఏడుస్తూ తిరుగుతున్నాడు. ఓ పొక్లెయిన్ చోదకుడు, మరొకరు బాలుడిని గుర్తించి తన ఫొటోను గ్రామ వాలంటీర్లు సద్దాం హుస్సేన్, ఈశ్వరయ్యలకు వాట్సాప్ గ్రూప్లో పెట్టారు. మహిళా పోలీసులు మానస, అరుణ వారి వద్దకు చేరుకుని బాలుడిని చేరదీశారు. మరోసారి ఫొటోను వాట్సాప్లో ఉంచారు. గ్రూప్లో వాలంటీరు వెంకటేశ్వర్లు ఆ బాలుడు మదార్వలి బంధువుల పిల్లవాడిగా గుర్తించి సమాచారం ఇచ్చారు. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు పోలీసులు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు.