
అభివృద్ధి, సంక్షేమం.. రెండు కళ్లు
సమావేశంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా
ఆళ్లగడ్డ, న్యూస్టుడే: అటు సంక్షేమ పథకాలు, ఇటు అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్లని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. శనివారం ఆళ్లగడ్డలో శాసనమండలి విప్, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకే అందేలా చేస్తున్నామన్నారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.450 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం దేశంలోనే ఒక చరిత్ర అన్నారు. తమ ప్రభుత్వ పాలనను చూసే ప్రజలు 80 శాతం స్థానాలకు పైగా పంచాయతీ స్థానాల్లో విజయాన్ని అందించారన్నారు. పురపాలక ఎన్నికల్లోనూ అంతకు మించి విజయాన్ని సాధిస్తామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను 95 శాతానికి పైగా నెరవేర్చామన్నారు. మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జిల్లాలో శిరివెళ్ల, చాగలమర్రి, నంద్యాల, వెలుగోడు, నందికొట్కూరు, ఆదోని, కర్నూలు పరిధిలో కేంద్ర మైనార్టీ సంక్షేమ నిధులతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన స్థల సేకరణను వెంటనే పూర్తి చేస్తామన్నారు. అవసరమైతే వక్ఫ్ స్థలాలను సేకరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి, నాయకులు సుధాకర్రెడ్డి, గఫూర్, నాయబ్, నజీర్, హ్యాపీ బాషా పాల్గొన్నారు.