
నిర్మల్ జిల్లాలో ప్రశాంతం
బంద్ను విరమించుకున్న భాజపా
భైంసా: నిర్మల్ జిల్లా భైంసాలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రంగంలోకి దిగిన పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు బందోబస్తులో భాగంగా భైంసా పట్టణంలోని పూర్వ వీధుల్లో ఉదయం కవాతు నిర్వహించాయి. ముందస్తు చర్యల్లో భాగంగా నిర్మల్తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాల సేవలు నిలిపివేశారు. పుకార్లు వ్యాప్తి చెందకుండా పోలీసు యంత్రాంగంలో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు నిర్మల్ జిల్లా బంద్కు పిలుపునిచ్చిన భాజపా బంద్ను విరమించుకుంటున్నట్లు ప్రకటించింది.
6 కేసులు నమోదు.. అదుపులో 20 మంది
భైంసా పట్టణంలో చోటుచేసుకున్న ఘర్షణల్లో 6 కేసులు నమోదయ్యాయని.. 20 మందిని అదుపులోకి తీసుకున్నట్లు కరీంనగర్ డీఐజీ ప్రమోద్కుమార్ వెల్లడించారు. భైంసా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ అంశం ఎన్నికల కమిషన్ పరిధిలోదని.. పోలీసు బందోబస్తు పరంగా ఎలాంటి ఇబ్బంలు లేవని ప్రమోద్ కుమార్ తెలిపారు. భైంసాలో పరామర్శలు, పలకరింపులకు నేతలెవరికీ అనుమతిలేదని ఆయన స్పష్టం చేశారు. పుర ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలకు నిబంధనలకు లోబడి అనుమతులిస్తామని పేర్కొన్నారు.