
తాజా వార్తలు
టాప్ టెన్ న్యూస్ - 9PM
1. ప్రైవేటు పాఠశాలల సిబ్బందికి కేసీఆర్ గుడ్న్యూస్
కరోనా పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు పాఠశాలల సిబ్బందికి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందికి సాయం ప్రకటించారు. నెలకు రూ.2వేల ఆపత్కాల ఆర్థిక సాయం, రేషన్ దుకాణాల ద్వారా 25కిలోల బియ్యం అందివ్వాలని సీఎం నిర్ణయించారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
2. నక్సల్స్ చెర నుంచి ఆ జవానుకు విముక్తి
ఛత్తీస్గఢ్ అడవుల్లో భీకర ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టుల చెరలో చిక్కుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్కు విముక్తి లభించింది. ఐదు రోజుల తర్వాత నక్సల్స్ ఆ జవానును విడుదల చేశారు. దీంతో ఆయన బీజాపూర్లోని సీఆర్పీఎఫ్ శిబిరానికి చేరుకున్నారు. బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దులో ఈ నెల 3న జరిగిన ఎన్కౌంటర్లో 28మంది భద్రతా సిబ్బంది మృతిచెందగా.. రాకేశ్వర్ సింగ్ను మావోయిస్టులు అపహరించిన విషయం తెలిసిందే. జవాను తమ వద్ద బందీగా ఉన్నట్లు ఈ నెల 5న లేఖ విడుదల చేసిన నక్సల్స్.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
3. హనుమంతుడి జన్మస్థానం తిరుమలే!
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారు కొలువైన తిరుమల క్షేత్రం ఇకపై హనుమంతుని జన్మస్థానంగానూ గుర్తింపు పొందనుంది. ఏప్రిల్ 13న తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ఈ విషయాన్ని పురాణాలు, శాసనాలు, శాస్త్రీయ ఆధారాలతో సహా నిరూపించేందుకు తితిదే సిద్ధమైంది. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గురువారం ఈ విషయంపై నిపుణుల కమిటీ సభ్యులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. కమిటీలోని పండితులు జ్యోతిష శాస్త్రం, శాసనాలు, పురాణాలు, శాస్త్రీయ ఆధారాలతో ఉగాది రోజున ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తారన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
4. విజయవాడ: భార్యను చంపిన వ్యక్తికి ఉరిశిక్ష
భార్యపై పెట్రోల్ పోసి హత్య చేసిన కేసులో భర్తకు విజయవాడ మహిళా సెషన్స్ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. 2019లో నగరంలోని కృష్ణలంకలో గర్భవతిగా ఉన్న తన భార్యపై భర్త బత్తుల నంబియార్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె మృతిచెందింది. ఈ కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం ఈరోజు తీర్పు వెలువరించింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
5. చంద్రబాబు పీఏ, తెదేపా నేతలు అరెస్ట్
తెదేపా అధినేత చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడు (పీఏ) మనోహర్తో పాటు పలువురు తెదేపా నేతలను కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. గోనుగూరు గుడిలో విగ్రహాల ధ్వంసం కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసుతో సంబంధం లేనివారిని ప్రశ్నిస్తున్నారంటూ సీఐ కార్యాలయం వద్ద చంద్రబాబు పీఏ మనోహర్ సహా పలువురు తెదేపా నేతలు ధర్నాకు దిగారు. దీంతో మనోహర్తో పాటు మరో 19 మంది నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
6. ఐపీఎల్ అలగ్.. తొడకొట్టిన గేల్..ధోనీ గోలీలాట..
ఇండియన్ ప్రీమియర్ లీగ్కు మరొక్క రోజే ఉందంటూ ఐపీఎల్ ట్వీట్ చేసింది. #IndiaKiVibeAlagaHai పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. అదిప్పుడు వైరల్గా మారింది. సన్రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ మ్యాచులతో హోరెత్తిస్తోంది. బ్యాట్స్మెన్, బౌలర్లు పోటాపోటీగా తలపడ్డారు. మరోవైపు వీణా శ్రీవాణి సన్రైజర్స్ థీమ్సాంగ్ను వీణపై వాయించారు. బయో బుడగల్లో కష్టంగా ఉన్నా జట్టు సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతోందని రోహిత్ శర్మ అంటున్నాడు. చెన్నైలో తమ అనుభవం గురించి ఆటగాళ్లు సంతోషంగా ఉన్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
7. TS: ఆ గ్రామంలో లాక్డౌన్
పల్లెల్లోనూ కరోనా బుసలు కొడుతోంది. కొవిడ్ జాగ్రత్తలు పాటించకపోవడంతో కొంతమంది క్రమంగా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం గోపాల్పేట్లో ఇప్పటి వరకు 70 కరోనా కేసులు బయటపడ్డాయి. గురువారం ఒక్కరోజే 75 మందికి పరీక్షలు నిర్వహించగా.. 34 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
8. ‘లబ్ధి చేకూర్చాం.. మా అభ్యర్థిని గెలిపించండి’
ఉప ఎన్నిక నేపథ్యంలో తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని కుటుంబాలకు వైకాపా అధినేత, సీఎం జగన్ లేఖలు రాశారు. 22 నెలల పాలనా కాలంలో వైకాపా ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన మేలును ఈ లేఖలో వివరించారు. క్యాంపు కార్యాలయంలో తొలి లేఖపై జగన్ సంతకం చేశారు. వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ ఆసరా, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ పింఛన్ కానుక, జగనన్న అమ్మ ఒడి, పేదలందరికీ ఇళ్లు తదితర పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన లబ్ధిని ఈ లేఖల్లో పేర్కొన్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
9. దేశ్ముఖ్పై సీబీఐ దర్యాప్తు.. అవసరమే
మహారాష్ట్రలో రూ. 100కోట్ల వసూళ్ల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు వ్యవహారంలో మహారాష్ట్ర సర్కారు, ఆ రాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తును సవాల్ చేస్తూ దేశ్ముఖ్, ప్రభుత్వం వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులపై ఆరోపణలు వచ్చినందున వాటిపై స్వతంత్ర దర్యాప్తు అవసరమేనని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
10. విమానంలో బట్టలు విప్పేసి.. హల్చల్!
బెంగళూరు నుంచి దిల్లీ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానంలో ఇటీవల అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. ఏప్రిల్ 6న ఐ5-722 విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు బట్టలు విప్పేసి నానా బీభత్సం సృష్టించాడు. సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తిస్తూ హల్చల్ చేశాడు. తొలుత అతడు లైఫ్ జాకెట్ల గురించి వాదనకు దిగాడు. అనంతరం సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తిస్తూ, అకస్మాత్తుగా బట్టల్ని పూర్తిగా విప్పేయడంతో తోటి ప్రయాణికులంతా విస్తుపోయారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి