
తాజా వార్తలు
ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తాం: ఫడణవీస్
భాజపా జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రస్తుత ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం మోపిందని అన్నారు. ఇవాళ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని మరోసారి ప్రమాణం చేస్తున్నట్లు చెప్పారు. ముంబయి దాడులు జరిగింది కూడా ఇవాళేనని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర భాజపా కార్యాలయంలో జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. సామాన్యుడి ఆకాంక్షల మేరకే మేనిఫెస్టో రూపొందించామన్నారు.
దేశమంతటికీ 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే హైదరాబాద్ సంస్థానానికి 1948 సెప్టెంబరు 17న వచ్చిందని, భాజపా అధికారంలోకి వస్తే సెప్టెంబరు 17ను విమోచన దినంగా జరుపుతామని ఫడణవీస్ తెలిపారు. కొవిడ్ సమయంలో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రులు సామాన్యులను దోచుకున్నాయన్నారు. మరోవైపు వరదల నివారణకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని, వరద సాయం కింద అర్హులందరికీ రూ.25వేల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చారు. ఓటు బ్యాంకు కోసం చేసిన తప్పిదాల వల్లే నగరం మునిగిపోయిందని విమర్శించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఫడణవీస్ ఆరోపించారు.తాము అధికారంలోకి వస్తే సామాన్యుడి సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, భూపేంద్ర యాదవ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
భాజపా ఇతర హామీలు
* గ్రేటర్ పరిధిలో అందరికీ కరోనా వ్యాక్సిన్.
* పాతబస్తీ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ.
*పాతబస్తీలో ప్రతి డివిజన్కు రూ.4 కోట్లకు తగ్గకుండా నిధులు.
*విద్యుత్ చౌర్యం నివారణకు చర్యలు.
*వీధి వ్యాపారులకు ఆరోగ్య బీమా.
* మెట్రో రైలు, సిటీబస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం.
*మహిళల కోసం కిలోమీటరుకో టాయిలెట్ ఏర్పాటు.
* గ్రేటర్ పరిధిలో టూవీలర్లు, ఆటోలపై ఇప్పటి వరకు ఉన్న చలాన్లు రద్దు.
* గ్రేటర్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్.. 24 గంటల ఉచితంగా మంచినీరు సరఫరా.
* కులవృత్తులకు ఉచిత విద్యుత్. ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తిపన్ను మాఫీ.
* పేదలకు వందయూనిట్ల లోపు ఉచిత విద్యుత్.
* మహిళల కోసం ఐదేళ్లలో 15 కొత్త మహిళా పోలీస్స్టేషన్ల ఏర్పాటు.
* గ్రేటర్లో అన్ని ప్రాంతాలకు మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సేవలు.
* విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు,వైఫై సౌకర్యం.
* ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకు చర్యలు.
* పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ సెంటర్లు.
* నగరంలో అతిపెద్ద తెలుగు గ్రంథాలయం ఏర్పాటు
* అనుమతులు అవసరం లేకుండా 125 గజాలలోపు ఇళ్ల నిర్మాణం.
* నాలాలు, డ్రైనేజీల ఆధునీకరణ కోసం రూ.10 వేల కోట్లతో ప్రత్యేక నిధి.
* ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు జంక్షన్కో పైవంతెన.
* పార్కింగ్ సమస్య పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ సెంటర్లు.
*జీహెచ్ఎంసీలో 28 వేల కొత్త నియామకాలు చేపడతాం.
* ఒప్పంద ఉద్యోగులకు భద్రత.
*జీహెచ్ఎంసీ కార్మికులకు పన్నుల మాఫీ.
* మూసీ పునరుజ్జీవనం కోసం మూసీ ఫ్రంట్ డెవెలప్మెంట్ ఏర్పాటు.
* ప్రతి డివిజన్లో గ్రీవెన్ సెల్ ఏర్పాటు. ప్రతి డివిజన్లో జిమ్,స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే జోన్ ఏర్పాటు.
* నగరానికి నలువైపులా డంపింగ్ యార్డుల ఏర్పాటు.
* హైదరాబాద్లో గుంతలు కనిపిస్తే 15 రోజుల్లోనే మరమ్మతులు.