
తాజా వార్తలు
ఇంద్ర దేవతల ముందు ఎవరు గెలవగలరు?
భారత మహిళల జట్టుకు శుభాకాంక్షల వెల్లువ
ఇంటర్నెట్డెస్క్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో తొలిసారి ఫైనల్ చేరిన భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంగ్లాండ్తో జరగాల్సిన సెమీ ఫైనల్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్ దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన హర్మన్ప్రీత్ జట్టు నేరుగా ఫైనల్కు దూసుకెళ్లింది. రెండో సెమీస్లో గెలిచిన జట్టుతో హర్మన్సేన ఆదివారం తుదిపోరులో తలపడనుంది. అయితే, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన రెండో సెమీస్కు సైతం వర్షం ముప్పు పొంచి ఉంది. ఉదయం నుంచి కురిసిన భారీ వర్షానికి ప్రస్తుతం సిడ్నీ క్రికెట్ మైదానం ఔట్ఫీల్డ్ చిత్తడిగా మారింది. దీంతో టాస్ ఆలస్యం కానుంది. ఒకవేళ ఈ మ్యాచ్ కూడా రద్దైతే ఆదివారం దక్షిణాఫ్రికాతో టీమ్ఇండియా ఫైనల్లో తలపడనుంది.
భారత మహిళలు తొలిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరడంతో పలువురు క్రికెటర్లు అభినందిస్తూ శుభాకాంక్షలు చెప్పారు. మిథాలి రాజ్, సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, మహ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా, అక్షర్ పటేల్ ట్విటర్లో స్పందిస్తూ ఫైనల్ మ్యాచ్కు శుభాకాంక్షలు పలికారు.
ఎవరేమన్నారంటే..
*ఒక భారతీయురాలిగా టీమ్ఇండియా ఫైనల్ చేరడం పట్ల అమితానందంగా ఉంది. అలాగే ఒక క్రికెటర్గా ఇంగ్లీష్ జట్టుపై జాలేస్తుంది. నేను లేదా నా జట్టు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిలో ఉండాలనుకోను. కానీ, నియమాలు ఇలాగే ఉన్నాయి. వాటిని పాటించక తప్పదు. టీమ్ఇండియాకు కంగ్రాట్స్. ఇది చాలా పెద్ద విజయం. -మిథాలి రాజ్
*సెమీఫైనల్స్ చూసుంటే బాగుండేది. కానీ ఇంద్ర దేవతల ముందు ఎవరు గెలవగలరు?కష్టానికి తగ్గట్టే మంచి ఫలితం దక్కుతుంది. గ్రూప్ దశలో అన్ని మ్యాచ్లు గెలుపొందినందుకు అభినందనలు. టీమ్ఇండియా ఈ ఆదివారం విజేతగా నిలవాలని కోరుతున్నా. -వీరేందర్ సెహ్వాగ్
*ఇంగ్లాండ్తో సెమీస్ చూసుంటే ఇంకా బాగుండేది. అయినా, ఫైనల్స్కు చేరిన హర్మన్ప్రీత్ సేనకు అభినందనలు. గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్ల్లోనూ విజేతగా నిలిచారు. ఫైనల్స్లో తలపడే జట్టుకు శుభాకాంక్షలు. -వీవీఎస్ లక్ష్మణ్
*ఏదైతే అది, ఇంగ్లాండ్తో సెమీస్లో తలపడే టీమ్ఇండియా దర్జాగా ఫైనల్ చేరుకోవాలనుకుంది. గ్రూప్ దశలో సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి ఫైనల్స్కు చేరడానికి అవకాశాన్ని దక్కించుకుంది. గుడ్లక్ టీమ్ఇండియా. ప్రపంచకప్ను భారత్కు తీసుకురండి. -మహ్మద్ కైఫ్
*ఫైనల్స్ చేరిన టీమ్ఇండియాకు అభినందనలు. టీ20 ప్రపంచకప్లో లీగ్ దశలో అత్యద్భుతంగా ఆడారు. -ఇర్ఫాన్ పఠాన్
*భారత మహిళలు టీ20 ప్రపంచకప్ ఫైనల్స్కు చేరినందుకు అభినందనలు. రాబోయే కాలంలో మరిన్ని విజయాలు సాధించాలి. ఫైనల్స్లోనూ అద్భుత విజయం సాధించాలి. -సురేశ్ రైనా
*టీ20 ప్రపంచకప్లో ఫైనల్స్ చేరిన భారత మహిళల జట్టుకు శుభాకాంక్షలు. ఆదివారం మీరందరూ మరింత చెలరేగేందుకు అండగా ఉంటాం. విజేతగా తిరిగిరండి. అందరికీ గుడ్లక్. -అక్షర్ పటేల్