
తాజా వార్తలు
కేటీఆర్కు ఇంగ్లీషు తప్ప పాలన రాదు: భట్టి
హైదరాబాద్: గత నాలుగు నెలల నుంచి తెలంగాణ రాష్ట్రం భయం గుప్పిట్లో బతుకుతుంటే.. ప్రజలను గాలికి వదిలేసి సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్లిపోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.ఉన్న అప్పులు సరిపోవడం లేదని, మళ్లీ కొత్త అప్పుల కోసం ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకం తీసుకున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ నాలుగైదు నెలల్లో మరో రూ. 30వేల కోట్లు అప్పులు చేశారు!. ఇప్పుడున్న రూ.3 లక్షల కోట్ల అప్పులను ఐదారు లక్షల కోట్లకు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజలకు అవసరమైన వైద్య, విద్యను పక్కకు పెట్టి.. సచివాలయం కూల్చివేత, నిర్మాణం కోసం టెండర్లు పిలుస్తున్నారు. మంత్రి కేటీఆర్కు ఇంగ్లీషు మాటలు తప్ప పరిపాలన మాత్రం రాదు’’ అని ఉత్తమ్ విమర్శించారు. ఇప్పటి వరకు తెచ్చిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తక్షణమే ఉస్మానియా అభివృద్ధి చేయాలి: ఉత్తమ్
కొత్త సచివాలయం పనుల నిర్మాణం ఆపేసి, తక్షణమే ఉస్మానియా ఆస్పత్రిని అభివృద్ధి చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన ఉత్తమ్.. అక్కడ అందుతున్న సేవలపై రోగులను కలిసి మాట్లాడారు. చిన్నపాటి వర్షానికే ఆస్పత్రిలోకి డ్రయినేజీ నీరు ప్రవహించడం కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఉత్తమ్ విమర్శించారు. వైద్యులకు 50శాతం ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు కరోనా నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు.