
తాజా వార్తలు
బిజినెస్లోనే కాదు నెట్టింట్లోనూ లెజెండ్సే
ఇంటర్నెట్డెస్క్: సెలబ్రిటీలు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది సినిమా రంగానికి చెందిన వారు మాత్రమే. తర్వాతి స్థానంలో రాజకీయనాయకులు ఉంటారు. అయితే వారు తమ వ్యక్తిగత, వృత్తికి సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తమ అభిమానులతో పంచుకుంటుంటారు. అందుకే వీరిని ట్విటర్, ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు. మరి వ్యాపారవేత్తలయితే నిత్యం ప్రణాళికలు, సమావేశాలతో రోజంతా తీరిక లేకుండా గడుపుతుంటారు. ఇక వారికి సామాజిక మాధ్యమాల్లో గడిపేంత తీరిక ఉండదు. అయితే దీనికి భిన్నంగా కొంత మంది వ్యాపారవేత్తలు సోషల్మీడియాలో చురుగ్గా ఉంటూ సమకాలీన అంశాలపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. దానితో పాటు తమ వ్యాపార సంబంధ విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. అలా సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్తో కొంత మంది వ్యాపారవేత్తలు సెలబ్రిటీలతో పోటీ పడుతున్నారు. మరి వారెవరో ఒకసారి చూసేద్దామా....
ఆనంద్ మహీంద్రా
మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా కీలకమైన పదవిలో ఉన్పప్పటికీ సమకాలీన అంశాలపై ట్విటర్ వేదికగా తనదైన శైలిలో స్పందిస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తారు.. ఆలోచింపజేస్తారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. ట్విటర్లో 74 లక్షల మంది ఈయనను ఫాలో అవుతున్నారంటే మహీంద్రాకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తన కంపెనీలోని ఉద్యోగులు, ప్రజలతో మమేకం అయ్యేందుకు సామాజిక మాధ్యమాలు ఎంతగానో దోహదపడుతున్నాయని ఆయన ఓ సందర్భంలో ప్రస్తావించారు. తనను కారు ఎంత మైలేజీ ఇస్తుందని అడిగిన వ్యక్తికి ఇది మైలేజీ ఇవ్వదు షాక్ (ఎలక్ట్రిక్ కారును ఉద్దేశించి) ఇస్తుందని చమత్కరించటం ఆయనకే చెల్లింది.
రతన్ టాటా
టాటా గ్రూప్ ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకొన్నాక ప్రజలతో మమేకం అవటంతో పాటు, సమాజాన్ని మరో కోణం నుంచి చూసేందుకు తాను ఇన్స్టాగ్రాం ఖాతా తెరుస్తున్నట్లు రతన్ టాటా తెలిపారు. అంతేకాదు ఆయన ఖాతా తెరిచిన నాలుగు నెలల్లోనే ఫాలోవర్ల సంఖ్య ఒక మిలియన్ (10 లక్షల) మార్కును చేరుకోవడం ఆయనకు నెట్టింట్లో ఉన్న క్రేజ్ను తెలియజేస్తుంది. ఈ సందర్భంగా ఆయన పెట్టిన ఫొటో ఒకటి ఎంతో పాపులర్ అయ్యింది. అంతే కాకుండా తనను ‘చోటు’ అని పిలిచిన నెటిజన్కు ఆయన ఇచ్చిన సమాధానం ఎంతో మందిని ఆకట్టుకుంది.
కిరణ్ మంజుదార్ షా
మహిళా పారిశ్రామికవేత్త, బయోకాన్ ఛైర్పర్సన్ కిరణ మజుందార్ షా కూడా సామాజిక మాధ్యమాల్లో తన శైలిలో స్పందిస్తుంటారు. పలు సందర్భాల్లో ట్విటర్ వేదికగా ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత విషయాలను కాకుండా వృత్తి పరమైన, రాజకీయ, సమాజానికి సంబంధించిన ఎన్నో అంశాలపై ఆమె ట్విటర్ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. అందుకేనేమో ఆమెకు ట్విటర్లో ఒక మిలియన్(14 లక్షలు)కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
హర్ష గోయెంకా
‘‘నీటి నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుందని నేను నా ఇంజనీరింగ్లో చదివాను. కానీ నీరు, విద్యుత్ కలిసి ప్రభుత్వ అధికారాన్ని ఇస్తాయని దిల్లీలో ఒక ఐఐటీ ఇంజనీర్ నన్ను నేర్చుకునేలా చేశాడు.’’ ఈ ట్వీట్ చూస్తే ఎకరికైనా ఆ పోస్ట్ పెట్టిన వాళ్లు సామాజిక మాధ్యమాల్లో చురుకైన వ్యక్తి అన్న భావన కలగక మానదు. కానీ ఈ ట్వీట్ చేసింది ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా అన్న విషయం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఇటీవల దిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్ను ఉద్దేశించి హర్ష గోయెంకా పై విధంగా ట్వీట్ చేశారు. వ్యాపారవేత్తగా తీరిక లేకుండా గడిపే ఆయన తనకు నచ్చిన అంశాలపై విభిన్న శైలిలో సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తుంటారు. ట్విటర్లో ఆయన్ను ఒక మిలియన్ (15లక్షలు) మంది ఫాలో అవుతున్నారు.
నందన్ నీలేకని
ఇన్ఫోసిస్ సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా, ఆధార్ వంటి ప్రముఖ ప్రాజెక్ట్కు ఛైర్మన్గా, రచయితగా నందన్ నీలేకని కీలకమైన పదవులను సమర్థంగా నిర్వహించారు. సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటారు. ట్విటర్లో ఆయన్ను రెండున్నర మిలియన్ (25 లక్షల) మంది ఫాలో అవుతున్నారు. ఇక నీలేకని ఎక్కువగా ఆధార్, వ్యాపారం, సాంకేతికత, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన విషయాలను ఎక్కువగా షేర్ చేస్తున్నారు.
జెఫ్ బెజోస్
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా స్థానాన్ని సంపాదించుకున్న జెఫ్ బెజోస్ను ట్విటర్లో ఒక మిలియన్ (12లక్షల) మంది ఫాలో అవుతున్నారు. అమెజాన్ పేరుతో ఆన్లైన్ మార్కెట్ను ప్రపంచంలో మారుమూల ప్రాంతాలకు చేరువ చేసిన బెజోస్ ఎక్కువగా తన వ్యాపారానికి సంబంధించిన విషయాలనే ట్విటర్లో షేర్ చేసుకుంటున్నారు.
ఎలాన్ మస్క్
ఎలాన్ మస్క్, ఈ పేరు చెప్పగానే మనకు టక్కున గుర్తొచ్చేది టెస్లా కార్ల కంపెనీనే. తక్కువ ధరకు వేగవంతమైన విద్యుత్ కార్లను అందించే సంస్థగా అనతికాలంలోనే టెస్లా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. అంతే కాకుండా స్పేస్ ఎక్స్ పేరుతో చౌకగా అంతరిక్ష ప్రయోగాలు చేపట్టడం, భవిష్యత్తులో ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు హైపర్లూప్ లాంటి సంస్థలతో పాటు కార్లలో కృత్రిమ సాంకేతికతను అందుబాటులోకి తేవడం వంటి ఎన్నో విలక్షణమైన వ్యాపారాలు ఆయన మానస పుత్రికలు. ఇలా ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు వ్యాపారం, సాంకేతికత, తన భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించిన విషయాలు ట్విటర్లో షేర్ చేసుకుంటారు. దాదాపు 31 మిలియన్ (3 కోట్ల) మంది ఆయన్ను ట్విటర్లో ఫాలో అవుతున్నారు. ఇటీవల ఆయన ‘బాజీరావ్ మస్తానీ’ సినిమాలోని దీవాన్ మస్తాన్ పాటకు సంబంధింన జిఫ్ ఇమేజ్ను పోస్ట్ చేస్తూ దాని సంబంధించిన వీడియో లింక్ను షేర్ చేశారు. ఆయన ఈ ట్వీట్ చేయగానే భారత్ నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు స్పందించారు.