
తాజా వార్తలు
అదే జరిగితే రాష్ట్రానికి ముప్పే: కేసీఆర్
హైదరాబాద్: మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాష్ట్రానికి మరోమారు మిడతల దండు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మిడతల దండుపై సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. గత నెలలో 3 దఫాలుగా వచ్చిన మిడతలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్కే వచ్చాయన్నారు. తాజాగా ఓ మిడతల దండు రాష్ట్రానికి 200 కి.మీ.దూరంలో ఉందన్నారు. దక్షిణంవైపు ప్రయాణిస్తే తక్కువ సమయంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని.. అదే జరిగితే ఏ క్షణంలోనైనా తెలంగాణకు ముప్పు వాటిల్లుతుందని తెలిపారు.
ఈ నెల 20 నుంచి జులై 5 వరకు మిడతల దండు రాష్ట్రంలోకి వచ్చే ప్రమాదం ఉందని.. ఈ నేపథ్యంలోనే సీఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే పంటలు పూర్తిగా నాశనం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దండు రాష్ట్రంలోకి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదం పొంచి ఉన్న 8 జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.