
తాజా వార్తలు
నాంపల్లిలో కారు బీభత్సం
హైదరాబాద్ (నాంపల్లి): నగరంలోని నాంపల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి ఓ హోటల్ ముందు నిలుచున్న సెక్యూరిటీ గార్డుని ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా సమీపంలో పార్కింగ్ చేసిన కొన్ని ద్విచక్ర వాహనాలపైకీ దూసుకెళ్లింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన అశ్విన్ (22) అనే యువకుడు నాంపల్లి రెడ్హిల్స్ మీదుగా బేగంపేట వైపునకు వేగంగా వెళ్తున్నాడు. రెడ్హిల్స్లోని నిలోఫర్ హోటల్ వద్దకు వచ్చే సరికి కారు అదుపుతప్పింది.
దీంతో హోటల్ ముందు వాహనాల పార్కింగ్ దగ్గర విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డును ఢీకొని అక్కడే పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లడంతో సుమారు 10 ద్విచక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డుకి గాయాలు కావడంతో అతడిని పోలీసులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండీ..
ఒకే ఒక్కడు.. పదులకొద్దీ యాప్లు
పులిగుండాలలో గల్లంతైన ముగ్గురూ మృతి