
తాజా వార్తలు
వైకాపా నేతలకు గెలవలేమనే భయం: చంద్రబాబు
అమరావతి: రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరిగితే గెలవలేమనే భయం వైకాపా నేతలకు పట్టుకుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇప్పడు ఎన్నికలు నిర్వహిస్తే బాధిత వర్గాలన్నీ కలిసి వైకాపాను ఓడిస్తాయనే భయంతోనే ఎన్నికలకు వెళ్లడం లేదని అన్నారు. వైకాపాను వదిలించుకోకపోతే రాష్ట్రానికి పట్టిన పీడ వదలదని వ్యాఖ్యానించారు. మండల స్థాయి పార్టీ నేతలతో నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో చంద్రబాబు మాట్లాడారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తిరుపతి ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు.
వైకాపా అధికారంలోకి వచ్చాక ఏ వర్గానికి ఎంత నష్టం జరిగిందనే విషయాలను ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు. ఎలాంటి నేరాలు చేయకుండానే ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజాబలం ముందు నియంతలందరూ తల వంచాల్సిందేనని చంద్రబాబు హెచ్చరించారు. వైకాపా బాధితులంతా ఏకమై నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లలో చేయాల్సిన అప్పును సీఎం జగన్ ఒక్క ఏడాదిలోనే చేశారని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లో వైకాపాపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. అంతా కలిసికట్టుగా రాష్ట్రాన్ని, భావితరాల భవిష్యత్తును కాపాడుకోవాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.