
తాజా వార్తలు
చైనా వ్యాక్సిన్.. విదేశాల్లో క్లినికల్ ట్రయల్స్
బీజింగ్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ.. వ్యాక్సిన్ ప్రయోగాల్లో వస్తున్న సానుకూల ఫలితాలు భవిష్యత్పై ఆశలు రేకెత్తిస్తున్నాయి. క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయినట్లు నిన్న రష్యా వ్యాక్సిన్ ప్రకటించిన నేపథ్యంలో చైనా కూడా తన చర్యలను ముమ్మరం చేసింది. చైనాలో కాన్సినో బయోలాజిక్స్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ను ఇతర దేశాల్లో నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఇందుకోసం రష్యా, బ్రెజిల్, సౌదీ ఆరేబియాలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది.
కొవిడ్కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో దాని కట్టడి కోసం చేపట్టిన చర్యలు విజయవంతమైన నేపథ్యంలో ఇప్పుడు ఆదేశంలో వ్యాక్సిన్ కోసం పెద్ద ఎత్తున్న చేపట్టనున్న క్లినికల్ ట్రయల్స్కు ఇబ్బంది ఏర్పడింది. దీంతో ఇతర దేశాల్లో వీటిని చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం కొన్ని దేశాలు మాత్రమే చైనాతో కలిసి పనిచేసేందుకు అంగీకరించినట్లు సమాచారం.
‘మూడో దశ ట్రయల్స్ కోసం మేం రష్యా, బ్రెజిల్, చిలీ, సౌదీ అరేబియాలతో మాట్లాడుతున్నాం. ఇవి ఇంకా చర్చల దశలో ఉన్నాయి’ అని కాన్సినో సహ వ్యవస్థాపకుడు క్యూ డొంగ్జూ తెలిపారు. తమ ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయని.. పరీక్షల కోసం 40 వేల మందిని నియమించుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపారు.
చైనాలో Ad5-nCov వ్యాక్సిన్ మానవులపై ప్రయోగాలకు తొలుత అనుమతి పొందినప్పటికీ.. పురోగతిలో ఇతర వ్యాక్సిన్ల కంటే వెనుకబడింది. సినోవాక్బయోటెక్, సినోఫామ్ రూపొందిస్తున్న రెండు వ్యాక్సిన్లకు ఇప్పటికే మూడో దశ ప్రయోగాల కోసం అనుమతి లభించింది.